మక్కల లారీలతో హామాలీలను పంపించాలి
ABN , First Publish Date - 2020-05-19T09:26:44+05:30 IST
మొక్కజొన్న బస్తాలను గోదాముల్లో దిగుమతి చేసేందుకు లారీల వెంట హామాలీలను పంపించాలని కలెక్టర్ వీపీ. గౌతమ్ తెలిపారు.
మహబూబాబాద్ టౌన్: మొక్కజొన్న బస్తాలను గోదాముల్లో దిగుమతి చేసేందుకు లారీల వెంట హామాలీలను పంపించాలని కలెక్టర్ వీపీ. గౌతమ్ తెలిపారు. మహబూబాబాద్ నుంచి సోమవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై సంబంధితాధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీబీ నగర్ గోదాముల వద్ద పని చేసే హామాలీలు బీహర్కు చెందిన కావడంతో వారు వాళ్ల రాష్ట్రానికి వెళ్లిపోయారని, దీంతో కొరత ఏర్పడిందన్నారు.
జిల్లా నుంచి వెళ్లే ప్రతి లారీతో స్థాని హామాలీలను తప్పనిసరిగా పంపించాలన్నారు. అప్పుడే మక్కల దిగుమతి వేగవంతమవుతుందన్నారు. ధన్నసరి పీఏసీఎస్ చైర్మన్ మర్రి రంగారావు మాట్లాడుతూ ఇప్పటి వరకు 30 వేల క్వింటాల మక్కలను తరలించామని, ఇంకా 5 వేల క్వింటాలు మాత్రమే నిల్వ ఉన్నాయని కలెక్టర్కు వివరించారు. బయ్యారం పీఏసీఎస్ చైర్మన్ మూల మధుకర్రెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా సహకార అధికారి ఇందిర పాల్గొన్నారు.