సమాచార కమిషనర్లుగా హరిప్రసాద్ రెడ్డి, చెన్నారెడ్డి
ABN , First Publish Date - 2021-05-05T09:13:34+05:30 IST
రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా మరో ఇద్దరిని ఎంపిక చేశారు. సీనియర్ పాత్రికేయుడు ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి, న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డిలను సమాచార కమిషనర్లుగా నియమించాలని నిర్ణయించారు
ఎంపిక చేసిన సీఎం జగన్.. గవర్నర్ వద్దకు ప్రతిపాదనలు
అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా మరో ఇద్దరిని ఎంపిక చేశారు. సీనియర్ పాత్రికేయుడు ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి, న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డిలను సమాచార కమిషనర్లుగా నియమించాలని నిర్ణయించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో వీరి పేర్లను ఖరారు చేశారు. తుది ఆమోదం కోసం ఫైలును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు పంపించారు. కర్నూలు జిల్లాకు చెందిన హరిప్రసాద్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘చరిత్ర’లో పీజీ పూర్తి చేశారు. అదే సమయంలో విద్యార్థి నాయకుడిగా కూడా వ్యవహరించారు. గత రెండు దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా భారత రాజ్యాంగం, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై అనేక విశ్లేషణాత్మక వ్యాసాలు రచించారు. ఇక... కాకర్ల చెన్నారెడ్డి పలు జిల్లాల కోర్టులతోపాటు ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర సమాచార హక్కు కమిషన్లో ఇప్పటికే ఒక చీఫ్ కమిషనర్తోపాటు ఐదుగురు కమిషనర్లు ఉన్నారు.