ప్రతిపక్షాలు ఏకమవ్వాలి : హర్సిమ్రత్ కౌర్
ABN , First Publish Date - 2021-07-31T20:38:58+05:30 IST
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు
న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు ప్రతిపక్షాల నుంచి సరైన మద్దతు కనిపించడం లేదని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవకపోతే ఆ ప్రభుత్వం నిరంతరం ప్రయోజనం పొందుతుందని చెప్పారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసిన అనంతరం శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.
హర్సిమ్రత్ కౌర్ నేతృత్వంలో ఓ బృందం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను శనివారం కలిసింది. ఈ బృందంలో బహుజన్ సమాజ్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, జమ్మూ-కశ్మీరు నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఉన్నారు.
కౌర్ మీడియాతో మాట్లాడుతూ, తాను కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే నేతలతో మాట్లాడానని, కలిసికట్టుగా సమస్యలపై పోరాడుదామని చెప్పానని అన్నారు. అయితే నేడు తమతో కలిసి వచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం విచారకరమని అన్నారు. ప్రతిపక్షాలు ఏకమయ్యే వరకు ప్రభుత్వం లబ్ధి పొందుతూనే ఉంటుందన్నారు.
కొత్త సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధర కొనసాగింపు కోసం రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో గత ఏడాది నవంబరు నుంచి నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో పలు విడతలు చర్చలు జరిపినప్పటికీ ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ఫలితాలు రావడం లేదు.