అమిత్ షాతో హర్యానా సీఎం భేటీ

ABN , First Publish Date - 2021-10-10T01:07:22+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో హర్యానా ముఖ్యమంత్రి

అమిత్ షాతో హర్యానా సీఎం భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్ శనివారం సమావేశమై, సింఘు, టిక్రి సరిహద్దులను తిరిగి తెరవడంపై  చర్చించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రైతుల నిరసనల తీరును వివరించారు. సింఘు సరిహద్దుకు వెళ్ళే రోడ్డును తెరవాలని వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు తనను కోరారని తెలిపారు. 


అమిత్ షాతో సమావేశం అనంతరం ఖత్తార్ మాట్లాడుతూ, తాను సింఘు, టిక్రి సరిహద్దులను తిరిగి తెరవడం గురించి అమిత్ షాతో మాట్లాడానని చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రైతులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల గురించి తెలియజేశానన్నారు. త్వరలోనే సరిహద్దులు తెరుచుకుంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. సింఘు సరిహద్దుకు వెళ్ళే రోడ్డును తెరవాలని సోనిపట్ జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజల ప్రతినిధులు తనను కోరారని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తోందని, ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. రైతులు నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. 


44వ నెంబరు జాతీయ రహదారిపై సింఘు సరిహద్దుల్లో అడ్డంకులను తొలగించేందుకు రైతులతో చర్చల కోసం హర్యానా ప్రభుత్వం సెప్టెంబరులో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సరిహద్దులను తెరవాలని కోరుతూ సోనిపట్ నివాసులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సెప్టెంబరు 6న తోసిపుచ్చింది. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించాలని తెలిపింది. 


Updated Date - 2021-10-10T01:07:22+05:30 IST