ఆప్ ఎమ్మెల్యే వీడియోతో చలించిన హర్యానా ప్రభుత్వం.. ఢిల్లీకి ఆక్సిజన్ తరలింపు..

ABN , First Publish Date - 2021-04-23T00:25:19+05:30 IST

ఆక్సిజన్ మాస్క్ ధరించి, ఊపిరి కోసం తన్నుకులాడుతూ ఆప్ ఎమ్మెల్యే ఒకరు కేంద్రానికి చేసిన విజ్ఞప్తిని చూసి ...

ఆప్ ఎమ్మెల్యే వీడియోతో చలించిన హర్యానా ప్రభుత్వం.. ఢిల్లీకి ఆక్సిజన్ తరలింపు..

న్యూఢిల్లీ: ఆక్సిజన్ మాస్క్ ధరించి, ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందిపడుతూ ఆప్ ఎమ్మెల్యే ఒకరు చేసిన విజ్ఞప్తిని చూసి హర్యానా ప్రభుత్వం చలించిపోయింది. పరస్పర నిందారోపణలకు ఇది సమయం కాదనీ.. అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం అంటూ భావోద్వేగంతో ఆయన చేసిన విన్నపాన్ని మన్నించింది. ఢిల్లీకి ఆక్సిజన్ అందించేందుకు ముందుకొచ్చింది. ఆమాద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఇటీవల కరోనా బారిన పడ్డారు. మూడు రోజుల క్రితం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. అయితే అక్కడ ఆక్సిజన్‌ కొరత ఉండడంతో ట్విటర్ వేదికగా ఇవాళ ఓ  వీడియో పోస్టు చేశారు. సదరు వీడియోలో ఆయన ఆక్సిజన్ మాస్క్ ధరించి, ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ కనిపించారు. ‘‘నేను చేరిన ఆస్పత్రిలో మరో మూడు గంటల వరకే ఆక్సిజన్ సరిపోతుంది. ఈ మాస్క్ తీసేస్తే... నా పరిస్థితి ఈత రానోడిని చెరువులోకి తోసేసినట్టు ఉంది. ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉంది...’’ అని ఆయన పేర్కొన్నారు.


ఢిల్లీ ఆక్సిజన్ సరఫరా ఆపొద్దంటూ కేంద్రం, హర్యానా ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘చాలా మంది ప్రజలు ఆక్సిజన్ ఆధారంగా ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు. ఆక్సిజన్ లేకపోతే వీరంతా నీళ్లులేని చెరువులో చేపలు చనిపోయినట్టు చనిపోతారు. పరస్పర నిందారోపణలకు ఇది సమయం కాదు.. అందరూ కలిసికట్టుగా ముందుకొచ్చి పనిచేయాల్సిన సమయం..’’ అని భరద్వాజ్ తన వీడియోలో పేర్కొన్నారు. ఢిల్లీ ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఆక్సిజన్‌కు తీవ్ర కొరత నెలకొన్న విషయం తెలిసిందే. కొన్ని ఆస్పత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ లేదంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. 



Updated Date - 2021-04-23T00:25:19+05:30 IST