ఏ రాష్ట్రమైనా జీతాలు తగ్గించిందా?
ABN , First Publish Date - 2022-01-20T07:40:25+05:30 IST
ఏ రాష్ట్రమైనా జీతాలు తగ్గించిందా?
ఇక్కడ అవినీతి, దుబారాతో దోచుకుంటున్నారు
సొంత మీడియాకు ప్రకటనలతో కోట్ల దోపిడీ
టీడీపీ హయాంలో ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు
సర్కారుపై టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): కరోనా వల్ల ఆదాయం తగ్గిందని దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉద్యోగులకు జీతాలు తగ్గించారా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. బుధవారం పార్టీ నేతలతో జరిగిన టెలి కాన్ఫరెన్స్లో ఆయన దీనిపై మాట్లాడారు. ‘దేశంలో ఒక్క జగన్ రెడ్డి మాత్రమే ఉద్యోగుల జీతాలు తగ్గించి వారిని కరోనా సమయంలో రోడ్డుకెక్కించారు. కరోనాతో ఆదాయం తగ్గిందనే అసత్య వాదనతో ఉద్యోగులను మోసం చేసే ప్రయత్నాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. వచ్చిన ఆదాయాన్ని అంతా దుబారా చేసి ఇప్పుడు బీద అరుపులు అరుస్తున్నారు. సొంత పత్రిక, టీవీ ప్రకటనలకు వందల కోట్లు దోచి పెడుతున్నారు. సీఎం తాను చేసిన దుబారా... అవినీతిని కరోనాపై నెట్టేస్తున్నారు’ అని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోటులో ఉన్నా ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందన్నారు.
ప్రభుత్వ వైఖరి దుర్మార్గం: యనమల
ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి దుర్మారంగా ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. రెండున్నరేళ్ల జగన్రెడ్డి పాలనలో ఉద్యోగులకు ఒరిగిందేంటి? ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ చరిత్రలో ఉందా? అసలు అశుతోష్ కమిటీ పీఆర్సీ సిఫారసులు ఏమయ్యాయి? అని ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్ర విభజన కారణంగా తీవ్ర ఇబ్బందులున్నా 43శాతం ఫిట్మెంట్ ఇచ్చామని గుర్తుచేశారు.