కుటుంబ సభ్యుల ముందే అంత్యక్రియలు: హత్రాస్ ఘటనపై యూపీ ఏడీజీ
ABN , First Publish Date - 2020-10-01T01:53:30+05:30 IST
యువతి మృతదేహాన్ని ఇంటికి తరలించాలని, ఉదయం దహన సంస్కారాలు నిర్వహిస్తామని బాధితురాలి తండ్రి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. రాత్రి 12.45 నిమిషాలకు బాధితురాలి మృతదేహాన్ని హత్రాస్కు తరలించారు
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో గ్యాంగ్రేప్కు గురైన ఓ యువతి మృతదేహానికి పోలీసులు అర్ధరాత్రి 2.30 గంటలకు హడావుడిగా దహనసంస్కారాలు నిర్వహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులకు కుమార్తెను కడసారి చూసే అవకాశం కూడా ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే దహనసంస్కారాలు బాధితురాలి కుటుంబ సభ్యుల ముందే నిర్వహించినట్లు ఉత్తరప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
‘‘పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో దహనసంస్కారాలు నిర్వహించాం. దీనికి కుటుంబ సభ్యుల సమ్మతి ఉందని, వారు చూస్తుండగానే అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోస్టుమార్టానికి సంబంధించిన వివరాలు త్వరలోనే బయటపెడతాం’’ అని ప్రశాంత్ కుమార్ అన్నారు.
అయితే ఈ విషయంలో వాదనలు మరోలా ఉన్నాయి. కుటుంబసభ్యులను ఇళ్లలో ఉంచి తాళాలు వేసి.. బయటకు రానీయకుండా చేసి మరీ బాధిత యువతి మృతదేహాన్ని పోలీసులు దహనం చేశారని, అంత్యక్రియలు జరిగిన ప్రదేశం నుంచి జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. ఢిల్లీ ఆసుపత్రి నుంచి బాధిత యువతి మృతదేహాన్ని 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్రాస్కు మంగళవారం రాత్రి తరలించారు. ఈ సందర్భంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. యువతి మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్కు కొందరు మహిళలు అడ్డు తగిలారు.
యువతి మృతదేహాన్ని ఇంటికి తరలించాలని, ఉదయం దహన సంస్కారాలు నిర్వహిస్తామని బాధితురాలి తండ్రి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. రాత్రి 12.45 నిమిషాలకు బాధితురాలి మృతదేహాన్ని హత్రాస్కు తరలించారు. మృతదేహాన్ని తక్షణమే దహనం చేయాల్సిందిగా కుటుంబ సభ్యులకు సూచించారు. వారు ఒప్పుకోకపోవడంతో రాత్రి 2.21 నిమిషాలకు బాధితురాలి మృతదేహాన్ని భారీ పోలీసు బందోబస్తు మధ్య దహన స్థలికి తీసుకెళ్లారు. 2.30 నిమిషాలకు మృతదేహాన్ని దహనం చేశారు.