హెచ్సీఎల్ టెక్... నిరుడు ఆదాయం రూ. 10 బిలియన్ డాలర్లు...
ABN , First Publish Date - 2021-01-17T19:36:17+05:30 IST
సాఫ్ట్వేర్ సేవల హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఈ ఏడాది(2020–21) మూడో త్రైమాసికంలో రూ. 3,982 కోట్ల నికర లాభాన్నార్జించింది. డిజిటల్ ఉత్పత్తుల విభాగంలో పటిష్ట వృద్ధి ఇందుకు సహకరించింది.
న్యూఢిల్లీ : సాఫ్ట్వేర్ సేవల హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఈ ఏడాది(2020–21) మూడో త్రైమాసికంలో రూ. 3,982 కోట్ల నికర లాభాన్నార్జించింది. డిజిటల్ ఉత్పత్తుల విభాగంలో పటిష్ట వృద్ధి ఇందుకు సహకరించింది. మూడవ త్రైమాసికం(అక్టోబరు–డిసెంబరు)లో మొత్తం ఆదాయం 6.4 శాతం పెరిగి రూ. 19,302 కోట్లను తాకింది.
స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయం తొలుత భావించిన 1.5–2.5 శాతం అంచనాలను మించుతూ 3.5 శాతం మేర బలపడింది. ఈ బాటలో నానలుగో త్రైమాసికం(జనవరి–మార్చి)లోనూ ఆదాయం 2–3 శాతం స్థాయిలో పుంజుకోనున్నట్లు అంచనా వేసింది. వెరసి గతంలో ఇచ్చిన 1.5–2.5 శాతం గైడెన్స్ను ఎగువముఖంగా సవరించింది.
కొత్త ఏడాది హుషారుగా... త్రైమాసిక ప్రాతిపదికన డిసెంబరు త్రైమాసికంలో పటిష్ట వృద్ధిని సాధించినట్లు హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈవో సి.విజయ్ కుమార్ పేర్కొన్నారు. డీల్ పైప్లైన్లో కనిపిస్తున్న వేగం ప్రకారం రానున్న త్రైమాసికాల్లో మరింత పురోగతిని సాధించే వీలున్నట్లు వెల్లడించారు. తద్వారా కొత్త ఏడాదిని హుషారుగా ప్రారంభించినట్లు వ్యాఖ్యానించారు. సొల్యూషన్లు, సర్వీసులపై దృష్టిపెట్టడం ద్వారా... కంపెనీ ప్రత్యేక తరహాలో వృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. నిరుడు జనవరి–డిసెంబరు మధ్యకాలంలో తొలిసారి ఆదాయం 10 బిలియన్ డాలర్లను అధిగమించినట్లు తెలిపారు. స్థిర కరెన్సీ ప్రాతిపదికన వార్షికంగా 3.6 శాతం పెరిగాయన్నారు. ఏడు బిజినెస్ విభాగాల్లో ఐదు సానుకూల వృద్ధిని సాధించినట్లు వివరించారు. ప్రధానంగా యూరోప్లో మీడియా, టెలికం విభాగాలు పటిష్ట ప్రగతిని సాధించినట్లు చెప్పారు.
ఇరవై వేల మందికి అవకాశం...
వాటాదారులకు షేరుకురూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్ను చెల్లించేందుకు బోర్డు నిర్ణయించింది. మూడవ త్రైమాసికంలో 13 ట్రాన్స్ఫార్మేషనల్ డీల్స్ను కుదుర్చుకుంది. డిసెంబరు త్రైమాసికంలో నికరంగా 6,597 మందిని నియమించుకుంది. ఈ క్రమంలో... ఉద్యోగ వలస 10.2 శాతంగా నమోదైంది. దీంతో కంపెనీ ఉద్యోగుల సంఖ్య తాజాగా 1,59,682 కు చేరుకుంది. మార్చి త్రైమాసికంలో ఐదు వేల మంది ఫ్రెషర్స్ను ఎంపిక చేసుకోనున్నట్లు ప్రకటించింది. రానున్న రెండు త్రైమాసికాల్లో 20, వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు విజయ్ కుమార్ వెల్లడించారు. ఐబీఎం డీల్ను పూర్తిచేసిన నేపధ్యంలో జూలై–డిసెంబరు మధ్య కాలంలో 13.4 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. ఐబీఎం సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ను రూ. 12,252 కోట్లకు హెచ్సీఎల్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.