ఈ తరం కుర్రాళ్లు ఇతడి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.. మంచం దిగలేడు కానీ కోట్లు సంపాదిస్తున్నాడు.. కాళ్లు చచ్చుబడిపోయినా..

ABN , First Publish Date - 2021-11-24T00:36:29+05:30 IST

కేరళలోని ఓ వ్యక్తి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కాళ్లు చచ్చుబడి మంచానికి పరిమితమైనా.. పట్టుదలను మాత్రం వదల్లేదు. మంచం దిగలేకున్నా కోట్లు సంపాదిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు..

ఈ తరం కుర్రాళ్లు ఇతడి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.. మంచం దిగలేడు కానీ కోట్లు సంపాదిస్తున్నాడు.. కాళ్లు చచ్చుబడిపోయినా..

నేటి తరం కుర్రాళ్లు.. ఈజీ మనీ కోసం అలవాటు పడి నేరాలకు పాల్పడుతుంటారు. కొందరైతే ఈజీగా కోట్లు వచ్చిపడాలని కలలు కంటూ ఉంటారు. అంతేగానీ ఆచరణలో మాత్రం చూపించరు. మరికొందరైతే ఎంత కష్టపడినా అంతంతమాత్రం సంపాదనతో బతుకు వెళ్లదీస్తుంటారు. అలాంటి యువకులు.. కేరళలోని ఓ వ్యక్తి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కాళ్లు చచ్చుబడి మంచానికి పరిమితమైనా.. పట్టుదలను మాత్రం వదల్లేదు. మంచం దిగలేకున్నా కోట్లు సంపాదిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..


కేరళలోని కాసరగడ్ జిల్లా ఈస్ట్ ఎలేరి పరిధిలో ఉన్న కంబలోర్‌కు చెందిన షాజవాస్(47).. డిగ్రీ పూర్తయ్యాక పరప్పా అనే ప్రాంతంలో ఓ ఎలక్ట్రికల్ షాపు నడిపేవాడు. అదే ప్రాంతంలో అతడి మేనమామ కలప వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో అతని మేనమామ ఆకస్మికంగా మృతి చెందాడు. తర్వాత ఆ వ్యాపారాన్ని షాజవాస్ కొనసాగించాడు. విజయవంతంగా వ్యాపారం చేస్తూ మంచి లాభాలను పొందేవాడు. తర్వాత రెహ్మత్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.


వ్యాపారంలో లాభాల బాటలో దూసుకుపోతున్న క్రమంలో షాజవాస్ జీవితంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. 2010 మేలో కలప కొనుగోలు చేసేందుకు కరకాల అనే ప్రాంతానికి వెళ్లాడు. రెండు లారీల్లో కలపను లోడ్ చేయించి, తిరుగు ప్రయాణమయ్యారు. లారీలను తీసుకుని తన మిత్రుడితో పాటూ కారులో వస్తున్నాడు. కేరళ సరిహద్దు దాటి కునియ సమీపంలోని పెరియతడుకమ్ చేరుకునే సరికి రాత్రి కావచ్చింది. దీంతో తన మిత్రుడు కునుకు తీశాడు. దీంతో వాహనం ఓ వైపునకు వెళ్తూ ఉంది. దీంతో చేయితో తట్టి లేపగా.. ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వాహనం పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో షాజవాస్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి.


గమనించిన స్థానికులు అతన్ని సమీపంలోని కన్హంగాడ్ ఆసుపత్రికి తరలించారు. అయితే రక్తం ఎక్కువగా పోవడంతో పరిస్థితి సీరియస్ అయింది. దీంతో మంగళూరులోని యూనిటీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. తలలో స్పైనల్ కార్డ్ దెబ్బతినిందని చెప్పారు. ఆపరేషన్ చేయడం కష్టమవడంతో నాలుగు నెలల పాటు ఐసీయూలోనే ఉంచారు. అనంతరం ఆపరేషన్ చేసేందుకు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఎట్టకేలకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. అక్కడే ఐదు నెలలు పాటు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.


ఆపరేషన్ పూర్తయినా నడవడం మాత్రం కష్టమని వైద్యులు తెలిపారు. మంచానికి పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చినా అతను భయపడలేదు. అక్కడి పరిస్థితులు చూశాక ఎలాగైనా బతికి సాధించాలని, వ్యాపారం కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అయితే వైద్యానికి డబ్బులు భారీగా ఖర్చు చేయడంతో వ్యాపారం చేసేంత పెట్టుబడి తన దగ్గర లేదు. దీంతో అతడి భార్య తన ఆభరణాలను ఇచ్చింది. వాటిని తాకట్టు పెట్టడం ద్వారా వచ్చిన మొత్తంతో కలప కొని వ్యాపారం ప్రారంభించాడు. లాభాలు రావడంతో మళ్లీ కలప కొనడం, అమ్మడం చేసేవాడు.


మంచానికే పరిమితమైనా.. తన ఎడమ చెవికి ఎయిర్ పాడ్ తగిలించుకుని వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నాడు. అలాగే టింబర్ డిపోల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, తద్వారా కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటాడు. కోట్ల రూపాయల విలువైన వ్యాపార కార్యకలాపాలను మంచంపై నుంచే పర్యవేక్షిస్తున్నాడు. ప్రస్తుతం కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. తన ఇద్దరు కూతుళ్లు, భార్య సహకారంతోనే ఇదంతా సాధ్యమైందని గర్వంగా చెబుతున్నాడు షాజవాస్. ప్రస్తుతం విదేశాల నుంచి కూడా కలపను తెప్పిస్తూ.. వ్యాపారాన్ని మరింత విస్తరించాడు.

Updated Date - 2021-11-24T00:36:29+05:30 IST