మాట వినడం లేదని గొంతు కోశాడు

ABN , First Publish Date - 2022-01-19T04:56:53+05:30 IST

ఆడపడచు భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఒక మహిళ అదే వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని తావుర్యాతండాలో మంగళవారం జరిగింది.

మాట వినడం లేదని గొంతు కోశాడు
పద్మ మృతదేహం

మహిళను దారుణంగా హతమార్చిన ప్రియుడు

టేకులపల్లి, జనవరి18: ఆడపడచు భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఒక మహిళ అదే వ్యక్తి చేతిలో  దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని తావుర్యాతండాలో మంగళవారం జరిగింది. తావుర్యా తండాకు చెందిన భూక్యా పద్మ(40)కు ఆదే గ్రామానికి చెందిన క్రిష్ణతో కొన్నేళ్లక్రితం వివాహం జరిగింది. వారికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే ఏడేళ్ల క్రితం ఆమె భర్త క్రిష్ణ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తరువాత పద్మను ఆమె ఆడపడుచు భర్త గుగులోతు వెంకన్న లోబరుచుకొని శారీరక సంబంధం ఏర్పరచుకొని తావుర్యాతండాలోని పద్మ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో 20రోజుల క్రితం పద్మ కూతురుని తన మొదటి భార్య కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని వెంకన్న కోరాడు. దానికి పద్మతో పాటు ఆమె కుమార్తె కూడా నిరాకరించి వెంకన్నను ఇంట్లో నుంచి గెంటివేశారు. దాంతో పద్మ తనమాట వినడంలేదని ఆమెను హతమార్చేందుకు పథకం పన్నాడు. ఈ క్రమంలో మంగళవారం పద్మ తన మిర్చితోటలో పని చేస్తుండగా అక్కడికి వెళ్లిన వెంకన్న కత్తితో పద్మ మెడకోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పద్మ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టేకులపల్లి సీఐ బీ. రాజు తెలిపారు.

Updated Date - 2022-01-19T04:56:53+05:30 IST