బోడిగూడెంలో హెల్త్‌ ఎమర్జెన్సీ : జేసీ హిమాన్షు

ABN , First Publish Date - 2021-12-07T05:09:33+05:30 IST

బోడిగూడెంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్య వల్లే ఇటీవల నలుగురు విద్యార్థులు మృతి చెందారని జేసీ హిమాన్షు శుక్లా వెల్లడించారు. విద్యా సంస్థల్లో ఎలాంటి ఫుడ్‌ పాయిజన్‌, మంచి నీటి కలుషితం కాలేదని తెలిపారు.

బోడిగూడెంలో హెల్త్‌ ఎమర్జెన్సీ : జేసీ హిమాన్షు
చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శిస్తున్న జేసీ హిమాన్షు శుక్లా

కొయ్యలగూడెం, డిసెంబరు 6 : బోడిగూడెంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్య వల్లే ఇటీవల నలుగురు విద్యార్థులు మృతి చెందారని జేసీ హిమాన్షు శుక్లా వెల్లడించారు. విద్యా సంస్థల్లో ఎలాంటి ఫుడ్‌ పాయిజన్‌, మంచి నీటి కలుషితం కాలేదని తెలిపారు. కొయ్యలగూడెం మండలంలోని మిగిలిన గ్రామాల్లోనూ జ్వరాలపై సర్వే జరుగుతుందని, ఈ నేపథ్యంలో హెల్త్‌ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం జేసీ బోడిగూడెంలో పర్యటించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, 108 వాహనాన్ని సిద్ధంగా ఉంచామని తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై సర్వే జరిపి నివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు.  కొయ్యలగూడెం పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అనారోగ్యంతో వున్న ముగ్గురికి మాత్రమే చికిత్స జరుగుతుందని తెలిపారు. జడ్పీ స్కూల్లో 265 మంది, ఎంపీపీలో 118 మందికి పరీక్షలు జరపాగా అందరూ ఆరోగ్యంగా ఉన్నారన్నారు. విద్యార్థులకు రెండు రోజులు సెలవులు ప్రకటించామన్నారు. డీఎంహెచ్‌వో నాయక్‌, డీఈవో రేణుక, డీటీవో రమేష్‌బాబు, ఆర్డీవో వైవీ ప్రసన్నలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-07T05:09:33+05:30 IST