గాలివాన బీభత్సం

ABN , First Publish Date - 2020-06-03T10:08:23+05:30 IST

జిల్లాలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఎర్రగుంట్లలో భారీగా

గాలివాన బీభత్సం

పడిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

ఎగిరిపోయిన ఇంటిపైకప్పులు


కమలాపురం/ఎర్రగుంట్ల, జూన్‌ 2: జిల్లాలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఎర్రగుంట్లలో భారీగా ఈదురుగాలులు చాలాసేపు వీచాయి. గాలికి తోడు భారీగా వర్షం పడింది. గాలికి చెట్లు నేలకొరిగాయి. కడప రోడ్డులోని రెండు చెట్లు విరిగిపడ్డాయి. అలాగే ముద్దనూరు రోడ్డులోని ఆర్‌అండ్‌బీ బంగ్లాలో చెట్టు విరిగిపడింది. న్యూకాలనీలో, మరో రెండు చోట్ల రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. సుందరయ్యనగర్‌లోని గోకుల మోహన్‌కు చెందిన ఇంటి రేకుల కప్పు ఎగిరిపోయి ఇంట్లోని సరుకులన్నీ తడిసిపోయాయి. పెద్దనపాడులో కూడా విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి, చెట్లు విరిగిపోయాయి. స్థానిక వినాయకనగర్‌లో వీధులు జలమయమయ్యాయి.  కమలాపురం మండలంలో పలు గ్రామాల్లో అనేక చెట్లు నేలకొరిగాయి. తురకపల్లె ప్రాంతంలో విద్యుత్‌ స్తంభాలు విరిగి పడిపోయాయి. సి.రాజుపాలెం గ్రామంలో వర్షం నీరు కాలువ ప్రవాహంలా ప్రవహించింది.


మండే ఎండలకు తోడు ఉక్కపోతతో అలమటిస్తున్న ప్రజలకు ఈ భారీ వర్షం కొంతైనా ఊరట కలిగించిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈదురుగాలులతో కూడిన వర్షం విద్యుత్‌శాఖకు నష్టాన్ని తెచ్చింది. పదిరోజులకు ముందు గాలివానకు మండల పరిధిలో అనే విద్యుత్‌ స్తంభాలు నేలకొరగ్గా ప్రస్తుతం కూడా పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. కడప నగరంలో కూడా భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. 

Updated Date - 2020-06-03T10:08:23+05:30 IST