భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం
ABN , First Publish Date - 2021-09-03T05:10:40+05:30 IST
హైదరాబాద్: భాగ్యనగరాన్ని గురువారం రాత్రి వర్షం ముంచెత్తింది. సుమారు మూడు గంటల పాటు ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో గల్లీలన్నీ వాగులను తలపించాయి. చిన్న చిన్న వాహనాలు, కూరగాయల బండ్లు.. వరద నీటిలో
హైదరాబాద్: భాగ్యనగరాన్ని గురువారం రాత్రి వర్షం ముంచెత్తింది. సుమారు మూడు గంటల పాటు ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో గల్లీలన్నీ వాగులను తలపించాయి. చిన్న చిన్న వాహనాలు, కూరగాయల బండ్లు.. వరద నీటిలో కొట్టుకుపోయాయి. ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిజాంకాలనీ, మెహరాజ్ కాలనీ, హకీంపేట్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది.
కృష్ణానగర్ బీ బ్లాక్లో వరద నీరు ముత్తెందింది. ఓ యువకుడు అందులో కొట్టుకుపోతుండడంతో స్థానికులు కాపాడారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 19 జీహెచ్ఎంసీ డిజాస్టర్, మాన్సూన్ బృందాలు రంగంలోకి దిగి.. రోడ్లపై నిలిచిన నీటిని మోటార్ల సాయంతో తొలగించాయి.
ఖైరతాబాద్ జోన్ పరిధిలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఎస్సార్ నగర్, అమీర్పేట రోడ్లలో ఎక్కడ చూసినా వరద నీరే దర్శనమిచ్చింది. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, ఎల్బీనగర్ పరిధిలో భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. కూకట్పల్లి పరిధిలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే షేక్పేట్లో 6.6 సెం.మీ., ఖైరతాబాద్ 6.4 సెం.మీ., కుత్బుల్లాపూర్ 5.8 సెం.మీ, బాలానగర్ 5.1సెం.మీ., సరూర్ నగర్ 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.