తిరుపతిలో భారీ వర్షం
ABN , First Publish Date - 2021-10-21T07:06:09+05:30 IST
ఉరుములు, మెరుపులతో తిరుపతిలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం పడింది. దాదాపు పది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కేవీబీపురంలో పిడుగుల వాన
తిరుపతి(కొర్లగుంట), అక్టోబరు 20: ఉరుములు, మెరుపులతో తిరుపతిలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం పడింది. దాదాపు పది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉరుముల శబ్ధానికి నగరవాసులు భయాందోళన చెందారు. సత్యనారాయణపురంలోని ఓ ఆలయ గోపురంపై పిడుగు పడటంతో ధ్వంసమైంది. స్థానికులు సమీపంలోని భవనాలు, షెడ్ల చాటున తలదాచుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇక, వర్షానికి తడవకుండా తిరుమల బైపా్సరోడ్డులోని గరుడవారధి (శ్రీనివాససేతు) కిందిభాగంలో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు బారులుతీరారు. ప్రధాన రహదారుల్లో నీళ్లు చేరడంతో పలుమార్లు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అలాగే కేవీబీపురం మండలంలో బుధవారం మధ్యాహ్నం పిడుగు పడడంతో ఆదావరం గ్రామానికి చెందిన రామచంద్రయ్య 25మేకలు మృతి చెందాయి.పూడి సీకే పురంలో ఒక ఆవు పిడుగుపాటుతో మృతి చెందగా దాని యజమాని అమవాసయ్య గాయాల పాలయ్యాడు. అలాగే వేమలపూడికి చెందిన చెంగయ్య, మురళి పొలంలో పని చేస్తుండగా పిడుగు పడడంతో గాయాల పాలయ్యారు.