జోరు వాన

ABN , First Publish Date - 2022-01-17T03:59:09+05:30 IST

ఉమ్మడి జిల్లాలో గడిచిన 24 గంటల్లో మోస్తారు

జోరు వాన
భారీ వర్షానికి నేలమట్టమైన ఇల్లు

  • జలమయంగా లోతట్టు ప్రాంతాలు
  • కాప్రాలో అత్యధికంగా 116.8 మిల్లిమీటర్లు వర్షపాతం నమోదు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌ ) : ఉమ్మడి జిల్లాలో గడిచిన 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. నగర శివారు ప్రాంతాల్లోని రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. మేడ్చల్‌ జిల్లా కాప్రాలో 11.68 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్‌ మండలం నాచారంలో 11.38 సెంటీ మీటర్లు, చిల్కీనగర్‌లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మారుతీ నగర్‌లో 9.65 సెంటీమీటర్లు,  మల్లాపూర్‌లో 7.93 సెంటీమీటర్లు, హబీ్‌సగూడ జేఎ్‌సఎన్‌ కాలనీలో 7.92 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్కాజ్‌గిరి మండలం మధుసూదన్‌నగర్‌లో 7.73 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మౌలాలిలో 7.33 సెంటీ మీటర్లు, న్యూ నాగోల్‌లో 7.15 సెంటీమీటర్లు, రాజీవ్‌నగర్‌లో 4.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం అలకాపూరి కమ్యూనిటీ హాల్‌ ప్రాంతంలో అత్యధికంగా 9.20 సెంటీమీటర్లు వర్షం కురిసింది. శంకర్‌పల్లిలో 9.08 సెంటీమీటర్లు, ఎల్బీనగర్‌ జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ సమీపంలో 7.85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్‌నగర్‌ మండలం విరాట్‌నగర్‌ ప్రాం తంలో 6.94 సెంటీమీటర్లు, భవానినగర్‌ ప్రాంతంలో 4.98 సెంటీమీటర్లు, రాక్‌టౌన్‌ కాలనీలో 4.95 సెంటీమీటర్లు, లింగోజిగూడలో 4.75 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో 1.33 సెంటీమీటర్లవర్షపాతం నమోదైంది. 


వర్షానికి కూలిన ఇల్లు 

శంకర్‌పల్లి: భారీ వర్షానికి ఓ ఇల్లు కూలిన ఘటన శంకర్‌పల్లి మండలం టంగటూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. టంగటూర్‌ గ్రామానికి చెందిన శేరిగూడ అంతయ్య కుటుంబసభ్యులతో కొన్నేళ్లుగా పెంకుటింట్లో నివాసం ఉంటున్నాడు. పాత ఇల్లు కావడంతో శనివారం అర్ధరాత్రి 2గంటలపాటు కురిసిన భారీవర్షానికి మట్టిగోడలు నాని ఇల్లు నేల మట్టమైంది. కుటుంబసభ్యులు పక్కనే ఉన్న వేరే గదిలో నింద్రిస్తుండటంతో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. ప్రభుత్వం సాయం అందజేసి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. 



Updated Date - 2022-01-17T03:59:09+05:30 IST