ఆగస్టులో భారీ వర్షాలు, వరద ముంపు నష్టం రూ.5.24 కోట్లు

ABN , First Publish Date - 2020-09-22T07:51:56+05:30 IST

ఆగస్టు నెలలో భారీ వర్షాలు, గోదావరి వరదల కారణంగా జిల్లాలోని సుమారు 23 మండలాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు

ఆగస్టులో భారీ వర్షాలు, వరద ముంపు నష్టం రూ.5.24 కోట్లు

సామర్లకోట, సెప్టెంబరు 21: ఆగస్టు నెలలో భారీ వర్షాలు, గోదావరి వరదల కారణంగా జిల్లాలోని సుమారు 23 మండలాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు రూ.5,24,52,759 నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ జిల్లా సంయ్తు సంచాలకుడు కేఎస్వీ ప్రసాద్‌ సోమవారం రాత్రి వెల్లడించారు. అప్పట్లో గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి అదనపు జలాలు జిల్లాకు చేరుకోవడంతో కోనసీమలోని పలు మండలాలతో పాటు ఏజెన్సీ, విలీన మండలాల్లో పొలాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. వరద ముంపులో 7,970 మంది భాధిత రైతులను గుర్తించగా 3550.118 హెక్టార్ల మేర పొలాలు నష్టపోయినట్టు అధికార యంత్రాంగం గుర్తించిందన్నారు. నష్టపోయిన వారిలో సన్న, చిన్నకారు రైతులు 7,434 మందికి ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ.4.27 కోట్లు అవసరం అవుతుందని గుర్తించామన్నారు.


ముంపు కారణంగా నష్టపో యిన 2,838 హెక్టార్లలో సన్న, చిన్నకారు, పెద్ద రైతులకు చెందిన వరి పొలాలు, 451 హెక్టార్లలో పత్తి పొలాలు, 24.44 హెక్టార్లలో మొక్కజొన్న పొలాలు, 1.13 ఎకరాల్లో కంది పంట పోయింది. ముమ్మిడివరం పరిధిలో 541 మంది రైతులకు చెందిన 231.38 హెక్టార్లలో ఇసుక మేటలు పేరుకుపోయాయని జేడీ చెప్పారు. మరో 536 పెద్ద రైతులకు చెందిన 388.543 హెక్టార్లలో పొలాలు ముంపు బారిన పడడంతో రూ.56.96 లక్షల ఇన్‌పుట్‌ సబ్సిడీకి అవసరమైన రైతులుగా గుర్తించారు. ఈ మేరకు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపినట్టు జేడీ ప్రసాద్‌ చెప్పారు.

Updated Date - 2020-09-22T07:51:56+05:30 IST