రాజధానిని ముంచెత్తిన వర్షం
ABN , First Publish Date - 2021-11-19T17:29:37+05:30 IST
వాయుగుండం ప్రభావంతో బెంగళూరు నగరంలో గురువారం సాయంత్రం తర్వాత కుండపోత వర్షం కురిసింది. రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి.
బెంగళూరు: వాయుగుండం ప్రభావంతో బెంగళూరు నగరంలో గురువారం సాయంత్రం తర్వాత కుండపోత వర్షం కురిసింది. రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు చోట్ల గంటల కొద్ది ట్రాఫిక్ స్థంభించింది. కాగా బీబీఎంపీ తక్షణ సహాయ కార్యక్రమాలను చేపట్టింది. ఈ మేరకు బీబీఎంపీ కమిషనర్ గౌరవ్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. సహాయ బృందాలు నగర ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా జలమయం అయిన ప్రాంతాల్లో పరిశీలనలు జరుపుతున్నాయి. బీబీఎంపీలో ప్రత్యేక హెల్ప్లైన్లు కూడా ప్రారంభించామని గౌరవ్గుప్తా వెల్లడించారు.
విద్యాసంస్థలకు సెలవు
భారీ వర్షాల కారణంగా రాజధాని బెంగళూరుతో పాటు అనేక జిల్లాల్లో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. అనేక పాఠశాలల్లోకి వర్షం నీరు చేరినట్లు ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక విద్యాశాఖా మంత్రి బీసీ నాగేష్ గురువారం సాయంత్రం మీడియాకు చెప్పారు.