ఏజెన్సీలో భారీ వర్షం
ABN , First Publish Date - 2021-04-21T05:23:32+05:30 IST
ఏజెన్సీలోని పలు మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. కొన్నిచోట్ల ఈదురు గాలులు వీచాయి.
ఖరీఫ్ పనులకు దోహదమంటున్న గిరిజన రైతులు
పాడేరురూరల్/ డుంబ్రిగుడ/ ముంచంగిపుట్టు/ హుకుంపేట/ సీలేరు, ఏప్రిల్ 20: ఏజెన్సీలోని పలు మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. కొన్నిచోట్ల ఈదురు గాలులు వీచాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ తీవ్రత వుండగా, అనంతరం వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. పాడేరు పట్టణంలో అరగంటపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు వర్షం కురిసింది. డుంబ్రిగుడ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల వడగళ్లు కూడా పడ్డాయి. డుంబ్రిగుడలో రహదారులపై నీరు ప్రవహించింది. వడగళ్లు పడడంతో మామిడి కాపు దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. ముంచంగిపుట్టు మండలంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. గాలులు బలంగా వీచడంతో జనం భయాందోళన చెందారు. హుకుంపేట మండలంలో సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. కొద్ది రోజుల నుంచి అడపాదడపా పడుతున్న వర్షాలు ఖరీఫ్ పనులకు దోహదపడతాయని రైతులు అంటున్నారు. జీకేవీధి మండలం సీలేరు, ధారకొండ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది.