913 కోట్లకు వీరే వారసులు

ABN , First Publish Date - 2020-05-28T09:34:13+05:30 IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన దాదాపు రూ.913 కోట్ల ఆస్తులకు ఆమె మేనల్లుడు దీపక్‌, మేనకోడలు దీప వారసులు కాబోతున్నారు. జయలలిత సోదరుడి సంతానమైన వీరిద్దరినీ...

913 కోట్లకు వీరే వారసులు

  • జయలలిత వారసులుగా దీప, దీపక్‌ 
  • మద్రాస్‌ హైకోర్టు తీర్పు
  • వారిద్దరికీ భద్రత కల్పించాలని ఆదేశం
  • స్మారక మందిరాలకు ప్రజాధనం వృధా చేయొద్దని సూచన

చెన్నై, మే 27(ఆంధ్రజ్యోతి): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన దాదాపు రూ.913 కోట్ల ఆస్తులకు ఆమె మేనల్లుడు దీపక్‌, మేనకోడలు దీప వారసులు కాబోతున్నారు. జయలలిత సోదరుడి సంతానమైన వీరిద్దరినీ ఆమెకు ద్వితీయ శ్రేణి వారసులుగా మద్రాసు హైకోర్టు బుధవారం స్పష్టమైన తీర్పు ఇచ్చింది. భారత వారసత్వ చట్టం ప్రకారం వారిద్దరినీ జయలలితకు ద్వితీయ శ్రేణి వారసులుగా ప్రకటిస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.కృపాకరన్‌, జస్టిస్‌ అబ్దుల్‌ ఖుదూ్‌సలతో కూడిన ధర్మాసన ం స్పష్టం చేసింది. జయలలిత నివాసగృహం వేదా నిలయాన్ని ప్రభుత్వం స్మారక మందిరంగా మార్చకూడదంటూ ఆమె మేనకోడలు దీప దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జయలలితకు సంబంధించి కొన్ని ఆస్తులను కేటాయించి, ఆమె పేరుతో సేవాభావంతో కూడిన ట్రస్టును నిర్వహించే బాధ్యతలను దీప, దీపక్‌లకు అప్పగించాలని, దీనిపై ఎనిమిది వారాల్లోగా తమకు నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జయలలిత ఆస్తులను నిర్వహించేందుకు ప్రత్యేక ట్రస్టీలను నియమించాలని కోరుతూ అన్నాడీఎంకే నేత పుగళేంది, జానకి రామన్‌ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. జయలలిత పోయెస్‌ గార్డెన్‌ నివాసాన్ని స్మారక మందిరంగా మార్చేందుకు ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు, దానికి సంబంధించి నష్టపరిహారాన్ని నిర్ణయించి, చట్ట్రపకారం జయలలిత వారసులైన దీపా, దీపక్‌లకు అప్పగించాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. అదే సమయంలో జయ నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకుని అందుకు భారీగా నష్టపరిహారం చెల్లించటానికి బదులు, ఆ ధనాన్ని నీటి పథకాలు, నీటివనరుల శుద్ధీకరణ పనులకు ఉపయోగించవచ్చునని సూచించింది. ప్రజాధనాన్ని స్మారక మందిరాల నిర్మాణానికి దుర్వినియోగం చేయరాదని స్పష్టం చేసింది. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడమే దివంగత నేతలకు అసలైన నివాళి అని పేర్కొంది.




జయ నివాసాన్ని పూర్తిగా స్మారక మందిరంగా మార్చే యోచనను ప్రభుత్వం పునఃపరిశీలించాలని, అవసరమైతే కొంత భాగాన్ని స్మారక మందిరంగా మార్చి, తక్కిన భాగాన్ని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగించే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. దీప, దీపక్‌లకు 24 గంటలూ భద్రత కల్పించాలని, జయ ఆస్తులలో ఒకదానిని విక్రయించగా వచ్చే ధనాన్ని బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసి ఆ వడ్డీని వారి భద్రతా చర్యలకు వినియోగించవచ్చునని హైకోర్టు పేర్కొంది. కాగా, మూడంతస్తుల స్మారక భవనంగా మార్చేందుకు జయ నివాసం, ఫర్నిచర్‌, పుస్తకాలు, నగలు తదితరాలను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా స్వాధీనం చేసుకునేలా గవర్నర్‌ భన్వరీలాల్‌ ఈనెల 22న ఆర్డినెన్స్‌ జారీ చేసిన నేపథ్యంలో తాజా తీర్పు వెలువడటం విశేషం.  


Updated Date - 2020-05-28T09:34:13+05:30 IST