జనంలో మార్పు.. పోలీసుల హర్షం

ABN , First Publish Date - 2021-03-09T23:01:21+05:30 IST

దీనిపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు.

జనంలో మార్పు.. పోలీసుల హర్షం

ఇంటర్నెట్ డెస్క్: హెల్మెట్ నిబంధనలను కఠినతరం చేశారు పోలీసులు. ద్విచక్రవాహనంపై వెనక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేశారు. దీనిపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. పలు ఆసక్తికర పోస్టుల పెడుతూ.. పబ్లిక్‌లో అవేర్‌నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు కూడా అంతే స్థాయిలో సఫలం అవుతున్నాయి. ద్విచక్రవాహనదారుల్లో మార్పు కనిపిస్తోంది. ప్రయాణిస్తున్న ఇద్దరూ హెల్మెట్స్ ధరించి కనపడటంతో.. ట్రాఫిక్ పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్నే చెబుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. నేషనల్ హైవే 44పై నిరంతరం సాగుతున్న పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలతో వాహన చోదకుల్లో మార్పు వచ్చిందంటూ తమ అధికారిక ట్విటర్‌లో పేర్కొన్నారు. వీటికి సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు. 




ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ‘ఈ మార్పు మీ ప్రాణాలను నిలబెట్టే మార్పు’ అని పేర్కొన్నారు. ఎవరో చలానా వేస్తారని, కేసు వేస్తారని కాకుండా.. ఎవరు గమనించినా, గమనించకపోయినా ‘మీకోసం మీరు’ ఇలాగే కొనసాగిస్తారని, కొనసాగించాలని కోరుకుంటూ.. ‘మీ క్షేమాన్నికోరుకునే, మీ శ్రేయోభిలాషి పోలీసు’ అంటూ ట్వీట్ చేశారు.  



Updated Date - 2021-03-09T23:01:21+05:30 IST