శశికళతో హీరో ప్రభు కుటుంబీకుల భేటీ
ABN , First Publish Date - 2021-02-26T14:36:45+05:30 IST
అన్నాడీఎంకే బహిష్కృత మహిళా నేత శశికళను కలిసే ప్రముఖుల సంఖ్య పెరిగిపోతోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతిని పురష్కరించుకుని అనేకమంది ...
చెన్నై/అడయార్(ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే బహిష్కృత మహిళా నేత శశికళను కలిసే ప్రముఖుల సంఖ్య పెరిగిపోతోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతిని పురష్కరించుకుని అనేకమంది సినీ సెలబ్రిటీలు ఆమెతో సమావేశమయ్యారు. ఇలాంటివారిలో దర్శకుడు భారతీరాజా, హీరో శరత్ కుమార్, సినీ నటి రాధికతో పాటు మరికొందరు ఉన్నారు. ఈ క్రమంలో గురువారం హీరో ప్రభు, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగానే వారు కలిశారు. అలాగే ఎమ్మెల్యే తెన్నరసు కూడా శశికళను కలిసినవారిలో ఉన్నారు. ఇదిలావుంటే, తమిళనాడు చలనచిత్ర నిర్మాతల సంఘం ఉపాధ్యక్షుడు, ప్రముఖ సినీ నిర్మాత సింగారవేలన్ వచ్చే ఎన్నికల్లో డీఎంకే తరపున పోటీ చేసేందుకు టిక్కెట్ కోరుతూ వినతిపత్రాన్ని డీఎంకే ప్రధాన కార్యాలయంలో సమర్పించారు. అదేవిధంగా దక్షిణ భారత నడిగర్ సంఘం ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు, డీఎంకే ప్రధాన కార్యాలయ కార్యదర్శి పూచ్చి ఎస్. మురుగన్ కూడా ఎన్నికల్లో డీఎంకే తరపున పోటీ చేయనున్నారు. ఇందుకోసం ఆయన టిక్కెట్ కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.