కుసుమ ఆర్ట్స్ పతాకంపై యాళ్ళ కీర్తి నిర్మాణ సారథ్యంలో.. జక్కుల నాగేశ్వరరావు సమర్పణలో రూపొందిన డబ్బింగ్ చిత్రం 'ఏఏఏ'. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత యాళ్ళ వెంకటేశ్వరరావు (కృపావరం) తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా నిర్మాత యాళ్ళ వెంకటేశ్వరరావు (కృపావరం) మాట్లాడుతూ.. ''టాప్ స్టార్స్ శింబు, తమన్నా, శ్రియ హీరో హీరోయిన్లుగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'ఏఏఏ'. యాక్షన్ తో పాటు ఫుల్ గ్లామర్ కలబోసిన చిత్రమిది. ఈ నెల 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రానికి కావాల్సిన అన్ని హంగులను సమకూర్చాం. డైలాగ్స్, పాటలు అన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. మా బ్యానర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అందరూ ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాను.." అని అన్నారు.