తీన్..మార్!
ABN , First Publish Date - 2020-05-23T07:49:13+05:30 IST
ఒకే రోజు... 3 ఎదురు దెబ్బలు! బహుశా... గతంలో ఏ ప్రభుత్వానికీ ఎదురుకాని చేదు అనుభవం! ఒక్క ఏడాదిలో అనేక వివాదాస్పద నిర్ణయాలను హైకోర్టు తప్పుపట్టింది.
ఆకుపచ్చ, నీలం, తెలుపు వైసీపీ పతాక రంగులకు ప్రతిబింబంగా ఉన్నాయనడంలో సందేహమే లేదు. అవి పాడిపంటలకు సంబంధించిన రంగులని సమర్థించుకుంటున్నారు. కోర్టు తీర్పుతో ఆటలు వద్దు. అధికారంలోకి వచ్చిన పార్టీ పతాక రంగుల్ని ప్రభుత్వ కార్యాలయాలకు వేయడం పరిపాటిగా మారింది. దీనికి ఫుల్స్టాప్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది.
మేజిస్ట్రేట్ నివేదిక ప్రకారం డాక్టర్ సుధాకర్ మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు అనిపించడం లేదు. డాక్టర్ సుధాకర్కు ఒక్కటే గాయమైనట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ... ఆయన శరీరంపై 6 గాయాలున్నట్లు మేజిస్ట్రేట్ ఫొటోలతో సహా నివేదిక ఇచ్చారు. యంత్రాం గం వేసిన కౌంటర్లు, నివేదికలన్నీ తప్పుడువేనని మేం భావించాలా?
- హైకోర్టు
హైకోర్టులో సర్కారుకు వరుస దెబ్బలు
ఆర్డర్... ఆర్డర్... ఆర్డర్!
ఒకే రోజు... 3 ఎదురు దెబ్బలు! బహుశా... గతంలో ఏ ప్రభుత్వానికీ ఎదురుకాని చేదు అనుభవం! ఒక్క ఏడాదిలో అనేక వివాదాస్పద నిర్ణయాలను హైకోర్టు తప్పుపట్టింది. ఇప్పుడు ఒకేరోజు మూడు అంశాలపై జగన్ సర్కారుకు చుక్కెదురైంది. ఒకటి... గ్రామ సచివాలయాలకు మళ్లీ వైసీపీ రంగులే పులమడం! రెండు... నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వ్యవహారం! ఈ రెండు అంశాల్లో సర్కారుకు హైకోర్టు ధర్మాసనం తీవ్రస్థాయిలోనే తలంటింది. ‘రాజకీయ రంగులు మార్చండి’ అని హైకోర్టు చెప్పిందంటే... మార్చాల్సిందే! కానీ... మరో రంగు జత చేసి కోర్టును, ప్రజలను ఏమార్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నంపై ధర్మాసనం విరుచుకుపడింది. ఇక... డాక్టర్ సుధాకర్ కేసులో ప్రభుత్వం చెప్పిన వివరాలను విశ్వసించలేమంటూ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
శుక్రవారం ప్రభుత్వానికి తగిలిన మూడో ఎదురు దెబ్బ... సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత. ఆయనను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన జీవోను రద్దుచేసి, మొత్తం ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు... ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులపై ప్రభుత్వం ఇచ్చిన జీవోపై గతంలో విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసేందుకు కోర్టు నిరాకరించింది. దీనిపై ప్రభుత్వం దాఖలు చేసిన స్టే వెకేట్ పిటిషన్ను తోసిపుచ్చింది. కరోనా లాక్డౌన్ సమయంలో కాలిబాట పట్టిన వలస కూలీల తరలింపుపై ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది.