అంబేడ్కర్‌ను మించిన జాతీయవాది లేరు

ABN , First Publish Date - 2022-04-14T08:40:49+05:30 IST

ఈ దేశంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను మించిన జాతీయవాది ఎవరూ లేరని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ అన్నారు. అలాంటి వ్యక్తికి

అంబేడ్కర్‌ను మించిన జాతీయవాది లేరు

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌

హైకోర్టులో ఘనంగా అంబేడ్కర్‌ జయంతి వేడుకలు


అమరావతి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఈ దేశంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను మించిన జాతీయవాది ఎవరూ లేరని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ అన్నారు. అలాంటి వ్యక్తికి కుల ముద్ర వేయడం దురదృష్టకరమన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ 131వ జయంతి వేడుకలను హైకోర్టులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఏపీ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌, బార్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ముందుగా న్యాయమూర్తులు జ్యోతి ప్రజ్వలన చేసి, అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మాట్లాడుతూ.. కార్మికులు, మహిళలు, ఇతర అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం అంబేడ్కర్‌ పోరాడారన్నారు. మొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన హిందూ కోడ్‌ బిల్లును యథాతథంగా ఆమోదించి ఉంటే.. ఆ రోజే మహిళలకు సమానత్వం, సార్వభౌమత్వం సంక్రమించేవన్నారు. దేశంలో రాజ్యాంగం అమలు చేయలేని పరిస్థితి ఇప్పటికీ ఉందన్నారు. ‘‘ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన 40 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టులో ఓ మహిళా న్యాయవాది.. న్యాయమూర్తిగా ఎలివేట్‌ అయ్యారని చెప్పారు. ఈ విషయాన్ని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. చీఫ్‌ జస్టిస్‌ రమణ చొరవతో ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. మొత్తం హైకోర్టుల్లో 16 మంది మాత్రమే ఎస్సీ, ఎస్టీ జడ్జీలు ఉన్నారు. 16 హైకోర్టుల్లో అసలు లేరు. దేశంలో సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగా తయారైంది. ఇప్పటికైనా న్యాయవాదులు, మేధావులు అంబేడ్కర్‌ బాటలో నడుస్తూ సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలి’ అని అన్నారు. జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ భావాలను ప్రజలందరికీ చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. జస్టిస్‌ ఏవీ. శేషసాయి మాట్లాడుతూ... బైబిల్‌, ఖురాన్‌, భగవత్గీత గ్రంథాల సారాంశమే రాజ్యాంగం అన్నారు. జస్టిస్‌ గంగారావు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్‌ కృషి చేశారన్నారు. అంతకుముందు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. అంబేడ్కర్‌ పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు అన్నారు.

Updated Date - 2022-04-14T08:40:49+05:30 IST