హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-05-23T08:43:33+05:30 IST
డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి):డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. మాస్క్లు సరఫరా చేయాలని కోరినందుకు సుధాకర్పై పోలీసుల దౌర్జన్యం, అక్రమ నిర్బంధం, దుష్ప్రచారం వెనుక దాగి ఉన్న ప్రభుత్వ కుట్రను సీబీఐ వెలికితీయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మాస్కులు అడిగినందుకు ఒక దళిత డాక్టర్ ఎదుర్కొన్న అవమానాలు, బెదిరింపులు, వేధింపులు... అన్నీ సీబీఐ విచారణలో బయటపడతాయి’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేశారు. డాక్టర్ సుధాకర్రాను హింసించిన పోలీసులపై కేసు నమోదు చేయాలని, కేసు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలివ్వడాన్ని టీడీపీ నేతలు స్వాగతించారు. ఈ తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, అఖిలప్రియ, రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి, పంచుమర్తి అనురాధ శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో వ్యాఖ్యానించారు.
‘‘డాక్టర్ సుధాకర్రావు కేసును సీబీఐకి అప్పగించడం శుభ పరిణామం. దళితుల ఆత్మగౌరవాన్ని న్యాయవ్యవస్థ కాపాడింది. పోలీసు వ్యవస్థకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి’’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత హితవు పలికారు. దళిత వైద్యుడి విషయంలో వైసీపీ ప్రభుత్వం మైండ్గేమ్ ఆడితే దళిత జాతి చూస్తూ ఊరుకోదని మాజీమంత్రి జవహర్ హెచ్చరించారు. కోర్టు ఎన్నిసార్లు తప్పుపట్టినా జగన్ వ్యవహారశైలిలో మార్పు రాలేదని, వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని మాజీమంత్రి నక్కా ఆనంద్బాబు విమర్శించారు. ‘డాక్టర్ సుధాకర్ విషయంలో అత్యుత్సాహంతో వ్యవహరించిన పోలీసులకు హైకోర్టు తీర్పుతో కనువిప్పు కలగాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.