మన్యంలో హైవే జోరుగా పనులు

ABN , First Publish Date - 2022-01-23T06:10:58+05:30 IST

విశాఖ మన్యంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం పాడేరు నుంచి అనంతగిరి వరకు పనులు జరుగుతున్నాయి. ఇంకా కొయ్యూరు, గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో భూ సేకరణ చేయాల్సి ఉంది.

మన్యంలో హైవే జోరుగా పనులు

రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం, పాడేరు, అరకు మీదుగా విజయనగరానికి జాతీయ రహదారి నిర్మాణం

మొత్తం 370 కిలోమీటర్లు

అంచనా వ్యయం రూ.1,575 కోట్లు


పాడేరు, జనవరి 22:

విశాఖ మన్యంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం పాడేరు నుంచి అనంతగిరి వరకు పనులు జరుగుతున్నాయి. ఇంకా కొయ్యూరు, గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో భూ సేకరణ చేయాల్సి ఉంది.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరం నుంచి రంపచోడవరం, కొయ్యూరు మండలం కాకరపాడు, పాడేరు, అరకులోయ, బొడ్డవర మీదుగా విజయనగరం వరకు సుమారు 370 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.1,575 కోట్లతో చేపట్టింది.  ఇందులో భాగంగా ప్రస్తుతం పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి మండలాల్లో పనులు జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం వున్న 23 అడుగుల రోడ్డును 64  అడుగుల (ఇరువైపులా 15 అడుగుల చొప్పున సర్వీస్‌ రోడ్లు, మధ్యలో 34 అడుగల మేర తారురోడ్డు)కు విస్తరిస్తున్నారు. మార్గమధ్యంలో అవసరమైనచోట్ల కల్వర్టులు, వంతెనలు నిర్మిస్తున్నారు. వీలైనంత మేర మలుపులను తగ్గిస్తూ రహదారి తిన్నగా వుండేలా కొండలను తొలుస్తున్నారు. ఈ పనులతో పాడేరు నుంచి అనంతగిరి వరకు రహదారి రూపురేఖలు మారిపోయాయి. ఇక కొయ్యూరు, గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాల పరిధిలో జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన భూ సేకరణ పూర్తయింది. చింతపల్లి మండలం లంబసింగి నుంచి జి.మాడుగుల మీదుగా పాడేరు వరకు భూసేకరణ చేపట్టాల్సి ఉంది.


2018లో కార్యరూపం

రాజమహేంద్రవరం నుంచి తూర్పుగోదావరి ఏజెన్సీ, విశాఖ ఏజెన్సీ మీదుగా విజయనగరానికి జాతీయ రహదారిని నిర్మించాల 2018లో  ప్రతిపాదన వచ్చింది. అయితే ఏజెన్సీలో కొయ్యూరు నుంచి చింతపల్లి, పాడేరు మీదుగా అరకులోయ వరకు వున్న 12 అడుగుల రహదారిని 23 అడుగులకు విస్తరిస్తే దానిని తాము 34 అడుగులకు విస్తరిస్తామని నేషనల్‌ హైవే అథారిటీ అఽధికారులు...రాష్ట్రంలోని రోడ్ల, భవనాల శాఖ అధికారులకు సూచించారు. అందులో భాగంగానే 2018, 2019 సంవత్సరాల్లో ఏజెన్సీలో కొయ్యూరు నుంచి పాడేరు మీదుగా అరకులోయ వరకు వున్న రోడ్డును 12 అడుగుల నుంచి 23 అడుగులకు అభివృద్ధి చేశారు. ఆయా పనులు పూర్తికావడంతో 2020లో జాతీయ రహదారి నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏ అఽధికారులు రంగంలోకి దిగారు. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు వున్న 370 కిలోమీటర్ల రోడ్డును ఆరు బ్లాక్‌లుగా విభజించి పనులు ప్రారంభించారు. 


హైవేతో మన్యంలో రవాణా వ్యవస్థ మెరుగు

జాతీయ రహదారి నిర్మాణంతో వల్ల గిరిజన ప్రాంతంలో రవాణా వ్యవస్థ మెరుగుపడడంతోపాటు అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి ఏజెన్సీ మీదుగా నిత్యం రాకపోకలు సాగుతున్నాయి. ప్రస్తుతం కొయ్యూరు, లంబసింగి, జి.మాడుగుల, పాడేరు, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి మండలాలు పర్యాటకంగా దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం పర్యాటకులు వస్తున్నారు. జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే పర్యాటకంగా, రవాణాపరంగా మరింత అభివృద్ధి చెంది స్థానికులకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మన్యం వాసులు భావిస్తున్నారు.

Updated Date - 2022-01-23T06:10:58+05:30 IST