హిమంత బిశ్వ శర్మ ముప్ఫయ్యేళ్ల క్రితం చెప్పినట్లే సీఎం అయ్యారు!

ABN , First Publish Date - 2021-05-12T22:20:33+05:30 IST

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముప్ఫయ్యేళ్ల క్రితం రినికి భుయాన్‌తో

హిమంత బిశ్వ శర్మ ముప్ఫయ్యేళ్ల క్రితం చెప్పినట్లే సీఎం అయ్యారు!

న్యూఢిల్లీ : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముప్ఫయ్యేళ్ల క్రితం రినికి భుయాన్‌తో చెప్పిన మాట నేడు నిజమైంది. తాను ఏదో ఓ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రినవుతానని ఆయన చెప్పారు. అప్పట్లో ఆయన వయసు 22 సంవత్సరాలు. 


గువాహటిలోని కాటన్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో హిమంత బిశ్వ శర్మ వయసు దాదాపు 22 ఏళ్ళు ఉంటుంది. రినికి భుయాన్ వయసు పదిహేడేళ్లు. ఆమెతో ఆయన మాట్లాడుతూ, ‘‘మీ అమ్మకి చెప్పు, ఏదో ఓ రోజు నేను అస్సాం ముఖ్యమంత్రినవుతాను’’ అన్నారు. 


శర్మ సతీమణి రినికి భుయాన్ అప్పటి మాటను గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తులో ఏమవ్వాలో ఆయనకు బాగా తెలుసునన్నారు. ఆయన 22 ఏళ్ళ వయసులో చెప్పినదే ఇప్పుడు నిజమైందన్నారు. మే 9న ఇంటికి వచ్చి, ‘డిజిగ్నేటెడ్ చీఫ్ మినిస్టర్’ అని చెప్పారన్నారు. ‘‘ఎవరు?’’ అని తాను అడిగినట్లు తెలిపారు. అందుకు బదులుగా ‘‘నేనే’’ అని శర్మ అన్నారని తెలిపారు. 


హిమంత బిశ్వ శర్మ ఎమ్మెల్యేగా ఉన్నపుడు తమ వివాహం జరిగిందని రినికి చెప్పారు. రకరకాల పరిస్థితులను ఆయన ఏవిధంగా తట్టుకున్నారో తనకు తెలుసునన్నారు. ఇప్పుడు ఆయన అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని, అయితే ఇది కల కాదు, నిజమేనని  గుర్తించడానికి తనకు మరికొన్ని రోజులు పడతాయని అన్నారు. 


హిమంత బిశ్వ శర్మ మే 10న అస్సాం 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీమంత శంకర్‌దేవ్ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన తల్లి మృణాళినీ దేవి, సతీమణి రినికి భుయాన్, కుమారుడు, కుమార్తె హాజరయ్యారు. 


Updated Date - 2021-05-12T22:20:33+05:30 IST