కరోనా మిస్టరీకి చైనా కొత్త ట్విస్ట్..!

ABN , First Publish Date - 2021-06-13T00:34:32+05:30 IST

ప్రపంచానికి కరోనా పీడ పట్టి ఏడాదికి పైగానే గడిచిపోయింది. కానీ దీని పుట్టుపూర్వోత్తరాలు ఇప్పటికీ ఓ మిస్టరీనే..! ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీకి కొత్త ట్విస్ట్ ఇచ్చారు.

కరోనా మిస్టరీకి చైనా కొత్త ట్విస్ట్..!

న్యూఢిల్లీ: ప్రపంచానికి కరోనా పీడ పట్టి ఏడాదికి పైగానే గడిచిపోయింది. కానీ దీని పుట్టుపూర్వోత్తరాలు ఇప్పటికీ ఓ మిస్టరీనే..! ప్రకృతిలో జరిగిన సహజమార్పుల ఫలితంగా ఓ కొత్త వైరస్ ఉనికిలోకి వచ్చి..ఆపై జంతువుల నుంచి మనుషులకు పాకిందా..? లేక.. క్షుద్రప్రయోగాల ఫలితంగా కళ్లుతెరిచిన భూతమా..? అనే ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం లేదు. అయితే..కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం..ఈ వైరస్ ప్రకృతిలో సహజంగా పుట్టినట్టైతే..మనుషులకు పాకే క్రమంగా ఈ వైరస్‌లో కొన్ని ఉత్పరివర్తనాలు చోటుచేసుకుని ఉండాలి. వాటి తాలుకు ఆనవాళ్లు గబ్బిలాలు, ఇతర జంతువుల్లో లభించాలి. కానీ ఇప్పటివరకూ అటువంటి ఆధారాలేవీ లభించలేదు. మరి ఇది కుటిల ప్రయోగాల పర్యవసానమా అంటే..అది కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కరోనా మిస్టరీకి కేంద్రంగా మారిన వుహాన్ ల్యాబ్‌ రికార్డుల్లోని కీలక వివరాలు ఇప్పటివరకూ అంతర్జాతీయ నిపుణుల కంట పడలేదు. వీటిని గోప్యంగా ఉంచేందుకు చైనా విశ్వప్రయత్నం చేస్తోందనేది అంతర్జాతీయ మీడియా కథనం..! 


ఇవన్నీ అలా ఉంచితే తాజాగా చైనా చేసిన ప్రకటన ఈ మిస్టరీకి కొత్త ట్విస్ట్ ఇచ్చింది. చైనాలోని నైరుత్య ప్రాంతంలో ఉన్న కొన్ని గబ్బిలాల్లో కొవిడ్-19ను పోలిన వైరస్‌లను కనుగొన్నట్టు అక్కడి పరిశోధకులు తాజాగా ప్రకటించారు. సహజమార్పుల కారణంగానే కరోనా ఉనికిలోకి వచ్చిందని చెప్పకనే చెప్పేశారు. అక్కడి గబ్బిలాలలో బయటపడ్డ పలు వేరియంట్లను పరిశీలించిన మీదట..కొవిడ్-19 లాంటి వైరస్‌లు అనేకం ఆ ప్రాంతంలో ఉనికిలో ఉన్నట్టు కనుగొన్నామని చెప్పారు. చైనా శాస్త్రవేత్తల ప్రకటన నేపథ్యంలో కరోనా పుట్టుకపై జరుగుతున్న పరిశోధన ఏ మలుపు తీసుకుంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 

Updated Date - 2021-06-13T00:34:32+05:30 IST