హితేష్ ట్రావెల్స్ బస్సు సీజ్: రూ.1.80 లక్షల జరిమానా
ABN , First Publish Date - 2022-01-19T07:03:35+05:30 IST
ఓ ట్రావెల్స్కు చెందిన బస్సును సీజ్ చేసి.. రూ.1.80లక్షల జరిమానా విధించినట్లు డీటీసీ బసిరెడ్డి తెలిపారు.
చిత్తూరు సిటీ, జనవరి 18: తప్పుడు ధ్రువపత్రాలతో నడుపుతున్న ఓ ట్రావెల్స్కు చెందిన బస్సును సీజ్ చేసి.. రూ.1.80లక్షల జరిమానా విధించినట్లు డీటీసీ బసిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాకు వివరాలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రవాణా శాఖాధికారులు హైవేలపై వాహనాల తనిఖీ చేపట్టారు. ఈనెల 12వ తేదీన చిత్తూరు సమీపంలోని హైవేపై బెంగళూరు నుంచి విజయవాడకు వెలుతున్న హితేష్ ట్రావెల్స్ బస్సు రికార్డులను ఎంవీఐ క్రాంతికుమార్ తనిఖీ చేశారు. అందులో ప్రభుత్వానికి చెల్లించిన రూ.90వేల ట్యాక్స్కు సంబంధించిన ధ్రువపత్రాన్ని ఆన్లైన్లో పరిశీలించారు. అక్కడ ఎటువంటి రికార్డులు కనిపించక పోవడంతో సదరు ట్రావెల్స్ నిర్వాహకులను ప్రశ్నించగా.. ఆన్లైన్లో సాంకేతిక కారణాలవల్ల అప్లోడ్ అయినట్లు లేదన్నారు. అప్పటికి బస్సును పంపేసినా.. అనుమానంతో మరింత లోతుగా రశీదును పరిశీలించగా, నకిలీదని తేలింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం చిత్తూరు సమీపంలోని మహాసముద్రం టోల్గేట్ వద్ద విజయవాడ నుంచి బెంగళూరుకు వెళుతున్న ట్రావెల్స్ బస్సును గుర్తించి, సీజ్ చేశారు. అనంతరం బస్సును చిత్తూరు డీటీసీ కార్యాలయానికి తరలించి, ప్రయాణికులను ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు తరలించామని డీటీసీ తెలియజేశారు. అనంతరం ట్రావెల్స్ నిర్వాహకులపై కేసునమోదు చేసి, రూ.1.80 లక్షల జరిమానా విధించామన్నారు.