లద్దాక్ ప్రజా ప్రతినిధులతో అమిత్ షా భేటీ
ABN , First Publish Date - 2020-09-27T00:36:46+05:30 IST
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ లద్దాక్ ప్రజా ప్రతినిధులతో సమావేశం అయ్యారు...
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ లద్దాక్ ప్రజా ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ప్రస్తుతం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో నెలకొన్న పలు సమస్యలపై ఢిల్లీలో సుదీర్ఘ చర్చ జరిపారు. కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, హోంశాఖ సెక్రటరీ అజయ్ బల్లా, ఇంటిలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అర్వింద్ కుమార్ తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ‘‘మాజీ ఎంపీలు తుప్స్తాన్ చెవాంగ్, తిక్సాయ్ రింపోచే, మాజీ మంత్రి చెరింగ్ దోర్జెయ్ లక్రూక్ సహా లద్దాక్కి చెందిన మరికొందరు ప్రజా ప్రతినిధులతో హోంమంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు..’’ అని అమిత్ షా కార్యాలయం ట్వీట్ చేసింది.
ఈ సమావేశంలో పలు సమస్యలు, డిమాండ్లపై చర్చలు జరిగినట్టు హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. తూర్పు లద్దాక్లో 3,400 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వద్ద భారత్, చైనా బలగాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రధాన్యత సంతరించుకుంది. వారం రోజుల వ్యవధిలో అమిత్ షా ఈ తరహా కీలక సమావేశం నిర్వహించడం ఇది రెండోసారి. గత ఆదివారం అసోం సీఎం శర్వానంద సోనోవాల్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందంతో అమిత్ షా సమావేశం అయ్యారు. ఎన్ఆర్సీ, అసోం ఒప్పందం అమలు సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.