నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌

ABN , First Publish Date - 2021-07-30T04:34:47+05:30 IST

ప్రయాణికురాలు తన బ్యాగును ఆటోలోనే మరిచి పోగా, ఆ బ్యాగును పోలీసుల సమక్షంలో సదరు ప్రయాణికురాలికి అందజేసి జడ్చర్లకు చెందిన ఆటో డ్రైవర్‌ కోడిపర్తి ఆంజనేయులు నిజాయితీని చాటుకున్నాడు.

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌
పోలీసుల సమక్షంలో మహిళకు బ్యాగును అందజేస్తున్న ఆటో డ్రైవర్‌

నాలుగున్నర తులాల బంగారం, 10తులాల వెండి ఆభరణాలు అందజేత

జడ్చర్ల, జూలై 29 : ప్రయాణికురాలు తన బ్యాగును ఆటోలోనే మరిచి పోగా, ఆ బ్యాగును పోలీసుల సమక్షంలో సదరు ప్రయాణికురాలికి అందజేసి జడ్చర్లకు చెందిన ఆటో డ్రైవర్‌ కోడిపర్తి ఆంజనేయులు నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల మండలం లింగంపేటలో ఓ శుభకార్యానికి హైదరాబాద్‌కు చెందిన పరమేశ్వరి జడ్చర్లకు వచ్చింది. లింగంపేటకు వెళ్లేందుకు కోడిపర్తి ఆంజనేయులు ఆటో ఎక్కింది. అనంతరం నాలుగున్నర తులాల బంగారు ఆభరణం, 10తులాల వెండి ఆభరణాలున్న బ్యాగును ఆటోలోనే మరిచి దిగి వెళ్లిపోయింది. ఆటోలో ఎవరో ప్రయాణికురాలు బ్యాగు మరిచిపోయిందని భావించి, వెంటనే జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ఆటోలో బ్యాగును మరిచిపోయానంటూ పోలీస్‌స్టేషన్‌కు సదరు మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చింది. దీంతో పూర్తి విచారణ చేపట్టారు. సదరు మహిళ పరమేశ్వరికి బ్యాగును జడ్చర్ల సీఐ వీరస్వామి, ఎస్‌ఐలు శంషొద్దీన్‌, అభిషేక్‌రెడ్డి, ఏఎస్‌ఐ ప్రిస్కిల్లా, ఆటో డ్రైవర్‌ యూనియన్‌ అధ్యక్షుడు షేక్‌హజీల సమక్షంలో అప్పగించాడు. నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్‌కు ప్రోత్సాహకంగా సీఐ వీరస్వామి రూ.1000 అందజేశారు. 

Updated Date - 2021-07-30T04:34:47+05:30 IST