విదేశాలలో తెలుగుపాట మాధుర్యాన్ని చవిచూపిన వినోద్బాబు: ఉపేంద్ర చివుకుల
ABN , First Publish Date - 2021-10-28T01:45:35+05:30 IST
కీబోర్డ్, గిటార్, ఫ్లూట్ వంటి 26 వాయిద్యాలు అలవోకగా వాయించడంలో నిపుణులుగా.. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, హాంగ్కాంగ్, సింగపూర్, కువైత్, మార్షియస్ వంటి దేశాలలో శ్రోతలకు తెలుగుపాట మాధుర్యాన్ని చవిచూపిన విశిష్ట అంతర్జాతీయ గాయకులు, గాత్రవాద్య ప్రజ్ఞానిధి వినోద్బాబు అని న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ యుటిలిటీ అంతర్జాలంలో ఆయనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో పేర్కొన్నారు.
ఉపేంద్ర చివుకుల(న్యూజెర్సీ పూర్వ అసెంబ్లీ సభ్యులు, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ యుటిలిటీ కమీషనర్)
న్యూజెర్సీ: కీబోర్డ్, గిటార్, ఫ్లూట్ వంటి 26 వాయిద్యాలు అలవోకగా వాయించడంలో నిపుణులుగా.. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, హాంగ్కాంగ్, సింగపూర్, కువైత్, మార్షియస్ వంటి దేశాలలో శ్రోతలకు తెలుగుపాట మాధుర్యాన్ని చవిచూపిన విశిష్ట అంతర్జాతీయ గాయకులు, గాత్రవాద్య ప్రజ్ఞానిధి వినోద్బాబు అని న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ యుటిలిటీ అంతర్జాలంలో ఆయనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో పేర్కొన్నారు. వంశీ గ్లోబల్ అవార్డ్స్ - ఇండియా వారి ఆధ్వర్యంలో వంశీ వ్యవస్థాపక అధ్యక్షులు కళాబ్రహ్మ, శిరోమణి డా. వంశీ రామరాజు అధ్యక్షతన జరిగిన వినోద్బాబు సత్కారకార్యక్రమాన్ని వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధ, మేనేజింగ్ ట్రస్టీ శైలజ సుంకరపల్లి, సుధామయి కన్నుల పండువగా నిర్వహించారు. అంతర్జాలంలో జరిగిన ఈ కార్యక్రమంలో వినోద్బాబును ఆయన మాతృమూర్తి జ్ఞానకుమారి, అర్ధాంగి గాయత్రి, కుమార్తెలు శ్రావణి, భావన వారి స్వగృహంలో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా అమెరికా నుంచి శారద ఆకునూరి, తోటకూర ప్రసాద్(తానా పూర్వ అధ్యక్షులు), గురు రామాచారి, గాయని అనూరాధ, రేవతీ శ్రీనివాస్, సుజారమణ, హేమమాలిని, సీతారామయ్య, నేపథ్యగాయకులు వేణు శ్రీరంగం, నేపథ్యగాయకులు ప్రవీణ్ కొప్పుల, గాయనీమణులు దివాకర్ల సురేఖ మూర్తి, విజయలక్ష్మి, గౌరీ పార్వతీదేవి బొమ్మన(ఖతార్), అర్చన వెంకటేశ్వరరావు, అపర ఘంటసాల బాలకామేశ్వరరావు, కమలాశాస్త్రి, ఎస్విబి ఛానల్ నుంచి రామలక్ష్మి, కువాయత్ నుంచి అన్నదానం మురళీమనోహర్, శశిరాణి, శివశంకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్బాబును అజాతశత్రువని కొనియాడారు. రావు బాలసరస్వతి, జిక్కి, చిత్ర, లీల, పీ సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.బి. శ్రీనివాస్, వి. రామకృష్ణ వంటి ప్రముఖ గాయకులతో కలిసి పాడటమే కాకుండా అమెరికాలో జరిగిన ఘంటసాల ఆరాధనోత్సవాలలో పలుమార్లు పాల్గొని అనాథలు, దివ్యాంగులు, పేద, వృద్ధ కళాకారుల సహాయార్థం అనేక కార్యక్రమాలు లాభాపేక్ష లేకుండా నిర్వహించారని ప్రస్తుతించారు. ఈ సందర్భంగా వినోద్బాబు మాట్లాడుతూ భారత ప్రభుత్వ రైల్వేశాఖలో పనిచేస్తున్నాని, మానవసేవే మాధవ సేవగా భావించి అందరికీ చేయూతనివ్వడమే తన ధ్యేయమని అన్నారు.