రూ.200 కోసం హైదరాబాద్‌లో దారుణహత్య

ABN , First Publish Date - 2021-04-18T14:22:48+05:30 IST

‘నన్నెందుకు తిడుతున్నావు.. డబ్బులు నేను తీయలేదు. నాకేమీ తెలియదు’

రూ.200 కోసం హైదరాబాద్‌లో దారుణహత్య

హైదరాబాద్/అఫ్జల్‌గంజ్‌ : ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తున్న ఇద్దరి మధ్య రూ.200 కోసం జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసింది. నారాయణ్‌పేట్‌ జిల్లా ముమ్మిడి గ్రామానికి చెందిన ఆశప్ప(55) బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి గౌలిగూడ లేబర్‌ అడ్డా వద్ద ఉంటున్నాడు. దొరికిన పని చేసుకుంటూ రాత్రిపూట ఫుట్‌పాత్‌పై నిద్రిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే లేబర్‌ అడ్డా వద్ద కర్నూలు జిల్లా నందనవనం గ్రామానికి చెందిన బద్రి నాగేందర్‌ అలియాస్‌ పాములు(50) కూడా నిద్రపోతుంటాడు. సోమవారం రాత్రి బద్రి నాగేందర్‌ జేబులో ఉన్న రూ.200 ఎవరో దొంగిలించారు. అర్ధరాత్రి జేబులో చూసుకునేసరికి రూ.200 కనిపించకపోవడంతో పక్కనే పడుకున్న ఆశప్పపై అనుమానం వ్యక్తం చేస్తూ తిట్టడం ప్రారంభించాడు. 


‘నన్నెందుకు తిడుతున్నావు.. డబ్బులు నేను తీయలేదు. నాకేమీ తెలియదు’ అని ఆశప్ప చెప్పినా వినలేదు.. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో కోపోద్రిక్తుడైన బద్రి నాగేందర్‌ ఆశప్పను కొట్టి కింద పడేసి, తలపై బండరాయితో మోదాడు. దీంతో ఆశప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారమందుకున్న అఫ్జల్‌గంజ్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బద్రి నాగేందర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-04-18T14:22:48+05:30 IST