దివ్యాంగురాలి స్థలం కబ్జా

ABN , First Publish Date - 2021-12-08T04:23:38+05:30 IST

లక్షలు విలువ చేసే ఓ దివ్యాంగురాలికి సంబంధించిన ఇంటి స్థలంపై అధికార వైసీపీ నేతల కన్ను పడింది.

దివ్యాంగురాలి స్థలం కబ్జా
కబ్జా స్థలంలో నిర్మిస్తున్న ప్రహరీ

అధికార వైసీపీ నేతల దౌర్జన్యం

అడ్డుకోవాలంటూ బాధితురాలు వేడుకోలు

కావలిరూరల్‌, డిసెంబరు 7: లక్షలు విలువ చేసే ఓ దివ్యాంగురాలికి సంబంధించిన ఇంటి స్థలంపై అధికార వైసీపీ నేతల కన్ను పడింది. దానిని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకోబోయిన ఆమెపై దాడులకు పాల్పడ్డారు. పోలీసులను ఆశ్రయించగా ఆమెపైనే కేసులు పెట్టారు. దీనితో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో మంగళవారం సదరు వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్రమించి ఏకంగా ప్రహరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బాధితురాలు కొల్లు దేవి కథనం మేరకు... ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దివ్యాంగురాలు కొల్లు దేవి, శ్రీనివాసులు దంపతులు కావలి పట్టణం ముసునూరులో నివశిస్తున్నారు. వీరికి ముసునూరు రామ్‌నగర్‌లో 1987వ సంవత్సరంలో ప్రభుత్వం నివేశ స్థలం కేటాయించి పట్టా ఇచ్చింది. ఆమె దివ్యాంగురాలు కావడంతో భర్త చేసే కూలి పనుల ద్వారా జీవనం సాగిస్తూ ఆర్థిక స్థోమత లేక ఇంటి నిర్మాణం చేపట్టలేదు. ఆ స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసుకుని సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో నవంబరు 15వ తేదీన అగ్రకులాలకు చెందిన స్థానిక ముసునూరు వైసీపీ నేతలు కొందరు ఆ స్థలంలో కంచె తొలగిస్తుండగా ఆమె అడ్డుకుంది. దీంతో తనపై ముంగమూరు మహేష్‌రెడ్డి, మరికొందరు దాడి చేసి కొట్టడంతో డయిల్‌ 100కు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపింది. స్టేషన్లో నన్ను కొట్టిన వారే నాపైనే కేసు పెట్టడంతో నా ఫిర్యాదును పోలీసులు కూడా స్వీకరించలేదని వాపోయింది. దీంతో ద్వారా ఈ నెల 4వ తేదీన లోక్‌అదాలత్‌ను ఆశ్రయించానని పేర్కొంది. అయినా లక్షలాది రూపాయల విలువ చేసే ఆ స్థలంపై కన్నేసిన వైసీపీ నేతలు తనను చంపుతామని బెదిరిస్తూ దౌర్జన్యంగా మంగళవారం ప్రహరీ నిర్మాణం చేపట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని వేడుకుంటుంది.



Updated Date - 2021-12-08T04:23:38+05:30 IST