ప్రభుత్వ భవనాలను గడువులోపు నిర్మించండి!
ABN , First Publish Date - 2021-06-18T04:14:52+05:30 IST
ప్రభుత్వం చేపట్టిన భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ చక్రధర్బాబు సూచించారు. భవన నిర్మాణ పక్షోత్సవాల సందర్భంగా గురువారం ఆయన మండలంలో పర్యటించారు.
అధికారులకు కలెక్టర్ సూచన
ముత్తుకూరు, జూన 17 : ప్రభుత్వం చేపట్టిన భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ చక్రధర్బాబు సూచించారు. భవన నిర్మాణ పక్షోత్సవాల సందర్భంగా గురువారం ఆయన మండలంలో పర్యటించారు. ముత్తుకూరు సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ ఆరోగ్య క్లీనిక్లు, బల్క్, మిల్క్ కూలింగ్ యూనిట్ల భవన నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. జిల్లా, మండల గ్రామస్థాయిలో ఎక్కడికక్కడ ప్రత్యేక అధికారుల బృందం ప్రతిరోజు భవన నిర్మాణాలను పర్యవేక్షించి నివేదికలు అందచేయాలన్నారు. ఇచ్చిన లక్ష్యాలను గడువులోపు భవనాలను పూర్తి చేసేందుకు కృషి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా స్థలానికి సంబంధించిన సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ బాపిరెడ్డి, జడ్పీ సీఈవో సుశీల, ఎంపీడీవో ప్రత్యూష, మండల స్థాయి ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.