గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-09-16T13:41:06+05:30 IST
జగనన్న కాలనీలలో..
మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్
బాపట్ల: జగనన్న కాలనీలలో నివేశన స్థలాలు పొందిన ప్రతి లబ్ధిదారుడు గృహనిర్మాణాలు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎ.భానప్రతాప్ కోరారు. పట్టణంలోని మూడో వార్డు ఎం.ఎ్స.ఆర్ కళ్యాణమండపంలో బుధవారం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో 3,402 కుటుంబాలకు నివేశన స్థలాలు ఇవ్వగా 2,300 మంది మాత్రమే గ్రౌండింగ్ చేశారని అందులో కూడా 1000గృహాలు మాత్రమే వేగవంతంగా నిర్మిస్తున్నారన్నారు. మిగిలినవారు డ్వాక్రా గ్రూపుల్లో ఉంటే లింకేజి, ఎస్ఎల్ఎఫ్ ద్వారా రూ.35 వేలు రుణంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గృహాలు అవసరంలేని వారు మాత్రమే నిర్మాణాలు చేసుకోవటంలేదని భావించాల్సి వస్తుందన్నారు. నిజంగా గృహాలు లేకుంటే వెంటనే నిర్మించుకొని అందులోకి వెళ్ళాలని చెప్పారు. మెప్మా టీఎంసీ డి.హనుమానాయక్ మాట్లాడుతూ ఇప్పటికే 781 మందికి రూ.3 కోట్ల 67లక్షల మేర రుణాలుగా ఇప్పించామన్నారు. ఇంకా అవసరమైన లబ్ధిదారులు వస్తే రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ కె.శ్రీనివాసరావు, ఏఈ జీవీ ప్రసాదరావు, సీవో సీహెచ్ రావమ్మ, వర్క్ ఇన్స్పెక్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు.