హైవేల శాశ్వత దిగ్బంధనంపై సుప్రీంకోర్టు ఘాటు ప్రశ్న

ABN , First Publish Date - 2021-09-30T20:13:29+05:30 IST

సమస్యలను పరిష్కరించుకోవాలంటే న్యాయ వ్యవస్థ, ఆందోళన లేదా

హైవేల శాశ్వత దిగ్బంధనంపై సుప్రీంకోర్టు ఘాటు ప్రశ్న

న్యూఢిల్లీ : సమస్యలను పరిష్కరించుకోవాలంటే న్యాయ వ్యవస్థ, ఆందోళన లేదా పార్లమెంటు చర్చ వంటి మార్గాలు ఉన్నాయని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. హైవేలను ఏ విధంగా దిగ్బంధనం చేస్తారని ప్రశ్నిస్తూ, ఇది శాశ్వతంగా జరుగుతోందని, దీనికి ముగింపు ఎక్కడ? అని నిలదీసింది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధనం చేసిన రైతులను ఖాళీ చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ప్రశ్నలు సంధించింది. 


కోర్టు ఆదేశాలను అమలు చేయవలసిన విధి కార్యనిర్వాహక శాఖకు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీ-ఉత్తర ప్రదేశ్ సరిహద్దుల్లోని యూపీ గేట్ వద్ద రోడ్డు దిగ్బంధనాన్ని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌కు కొన్ని రైతు సంఘాలను పార్టీలుగా చేర్చేందుకు అధికారికంగా ఓ దరఖాస్తును దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణ సోమవారం జరుగుతుందని తెలిపింది. 


హైవేపై ప్రయాణాలకు ఆటంకం లేకుండా ఖాళీ చేయించాలని కోరుతూ నోయిడా నివాసి మోనికా అగర్వాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నిరసన కార్యక్రమాలకు పూర్వం 20 నిమిషాల్లో ఢిల్లీ చేరుకోగలిగేవారమని, హైవే దిగ్బంధనం వల్ల రెండు గంటలు పడుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. 


ఈ అంశంపై ప్రభుత్వం ఏం చేస్తోందని అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిరసన తెలుపుతున్న రైతులతో సమావేశాన్ని నిర్వహించినట్లు నటరాజ్ చెప్పారు. ఈ సమావేశం వివరాలను అఫిడవిట్లో పేర్కొన్నామన్నారు. 


తాము ఆదేశాలు జారీ చేస్తామని, అయితే వాటిని ఎలా అమలు చేయాలనేది కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన అంశమని, వాటిని కోర్టు అమలు చేయజాలదని సుప్రీంకోర్టు తెలిపింది. 


Updated Date - 2021-09-30T20:13:29+05:30 IST