లీకులు అరికట్టేదెలా..?
ABN , First Publish Date - 2021-12-06T06:16:02+05:30 IST
మోపాడు రిజర్వాయర్ లీకులు జాడ కానరాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారం రోజులుగా రిజర్వాయర్ నీటి మట్టం పెరిగింది.
పామూరు, డిసెంబరు 5: మోపాడు రిజర్వాయర్ లీకులు జాడ కానరాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారం రోజులుగా రిజర్వాయర్ నీటి మట్టం పెరిగింది. ఐదు రోజులు నుంచి రిజర్వాయర్ కట్టకు ఐదు చోట్ల లీకులు ఏర్పడ్డాయి. నాటి నుంచి నీరు పోతూనే ఉంది. లీకులను అరికట్టేందుకు చేస్తున్న సహాయక చర్యలు ఫలితం లేకుండా పోతుంది. గత ఏడాది రూ. 33 కోట్ల జైకో నిధులు మంజూరు కాగా గుత్తేదారుడు 25 శాతం తక్కువకు టెండర్లు వేసి కాంట్రాక్టు దక్కించుకున్నారు. వర్షాలు లేని సమయంలో కాంట్రాక్టర్లు పనులు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. వర్షాలు కురిసి రిజర్వాయర్లో 18 అడుగుల నీటిమట్టం చేరిన తరువాత పనులు చేసేందుకు కాలువల్లో, కట్టపై మొలిచిన చిల్లచెట్లను యంత్రాలతో తొలగించారు. గడిచిన వారం రోజుల నుంచి లీకులను అరికట్టేందుకు సహాయక చర్యలు చేపడుతున్నా లీకుల జాడ ఇంత వరకు కానరాక పోవడం విశేషం.
లీకులను గుర్తించి అరికడతాం :
మోపాడు రిజర్వాయర్ కట్టకు ఏర్పడ్డ లీకులను అరికడతామని తహసీల్దార్ సీహెచ్ ఉష అన్నారు. ఆదివారం రిజర్వాయర్ కట్ట లీకులను అరికట్టేందుకు చేపడుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. రిజర్వాయర్లో మరో 5 అడుగుల మేర నీటి మట్టాన్ని తగ్గిస్తే కానీ లీకుల వద్ద చేపడుతున్న సహాయక చర్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఏర్పడుతుందని తహసీల్దార్ తెలిపారు.