స్టాఫ్‌ నర్సు పోస్టులకు భారీగా దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-05-27T09:11:41+05:30 IST

కొవిడ్‌-19 బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన స్టాఫ్‌ నర్సు, అనస్థీషియా టెక్నీషియన్‌ పోస్టుల..

స్టాఫ్‌ నర్సు పోస్టులకు భారీగా దరఖాస్తులు

139 పోస్టులకు 2282 మంది దరఖాస్తు

49 అనస్థీషియా టెక్నీషియన్‌ పోస్టులకు 110 మంది పోటీ

28న ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టు విడుదల 


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం):కొవిడ్‌-19 బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన స్టాఫ్‌ నర్సు, అనస్థీషియా టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి కొద్ది రోజుల కిందట నోటిఫికేషన్‌ ఇవ్వగా, భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఏడాదిపాటు ఒప్పంద ప్రాతిపదికన పని చేసేందుకుగాను 139 స్టాఫ్‌ నర్సు, 49 అనస్థీషియా టెక్నీషియన్‌ పోస్టులకు కేజీహెచ్‌ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజైన సోమవారం నాటికి స్టాఫ్‌నర్సు పోస్టులకు 2282 మంది దరఖాస్తు చేసుకోగా,  ఒక్కో పోస్టుకు 16 మందికి పైగా పోటీ పడుతున్నారు. అదేవిధంగా అనస్థీషియా టెక్నీషియన్‌ పోస్టుకు 110 మంది దరఖాస్తు చేసుకున్నారు.


ఈ పోస్టులను విద్యార్హత పరీక్షల మార్కుల ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఒక్కో పోస్టుకు 1:3 చొప్పున అభ్యర్థులను పిలవాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 28 నాటికి ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టు, 29న అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు.  31న తుది మెరిట్‌ లిస్టును విడుదల చేయనున్నామని, జూన్‌ 2న స్టాఫ్‌ నర్సులకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అర్జున్‌ తెలిపారు. పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, దళారులను నమ్మి డబ్బులు ఇచ్చి ఎవరూ మోసపోవద్దని ఆయన సూచించారు.

Updated Date - 2020-05-27T09:11:41+05:30 IST