చొరబాటుకు సిద్ధంగా 230 మంది ఉగ్రవాదులు!

ABN , First Publish Date - 2020-04-10T01:54:55+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారి పీడిస్తున్న సమయంలో కూడా ఉగ్రవాదుల రాక్షస మనస్తత్వం మారడం లేదు

చొరబాటుకు సిద్ధంగా 230 మంది ఉగ్రవాదులు!

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి పీడిస్తున్న సమయంలో కూడా ఉగ్రవాదుల రాక్షస మనస్తత్వం మారడం లేదు. పాకిస్థాన్ కేంద్రంగాగల ఉగ్రవాద సంస్థలు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి జమ్మూ-కశ్మీరులోకి పంపించేందుకు దాదాపు 230 మంది ఉగ్రవాదులను సిద్ధంగా ఉంచాయి. సరిహద్దుల ఆవలి నుంచి వచ్చే ఉగ్రవాదంపై నిఘా కార్యకలాపాలకు సంబంధించిన వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కశ్మీరు లోయలోకి, జమ్మూ ప్రాంతంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు. 


కశ్మీరులోకి చొరబడేందుకు 160 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి లాంచ్ ప్యాడ్స్ వద్ద ఉన్నారు. వీరంతా పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలు లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందినవారు. 


అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జమ్మూ సెక్టర్‌లోకి చొరబడేందుకు సుమారు 70 మంది ఉగ్రవాదులు కాచుకుని కూర్చున్నారు. వీరంతా శిక్షణ పొందిన ఉగ్రవాదులు. కంచె లేనటువంటి ప్రాంతాల గుండా భారత్‌లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారు. 


జైషే మహమ్మద్ ఉగ్రవాదులు సమని-భింబర్, దుధ్నియల్ శిబిరాల వద్ద ఉన్నారు. ఇవి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని ప్రాంతాలు. లష్కరే తొయిబా ఉగ్రవాదులు లీపా, కేల్ లాంచింగ్ ప్యాడ్స్ వద్ద సిద్ధంగా ఉన్నారు. 


భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను తీవ్రతరం చేయడం కోసం జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఫిబ్రవరి నుంచి సియాల్‌కోట్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులను సిద్ధంగా ఉంచింది.




Updated Date - 2020-04-10T01:54:55+05:30 IST