వర్క్ప్లేస్లో వేధింపులపై సుందర్ పిచ్చాయ్కి వందలాది మంది ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-04-11T19:54:09+05:30 IST
వర్క్ప్లేస్లో వేధింపులను తట్టుకోలేకపోతున్నామని వేలాది మంది ఆల్ఫాబెట్
న్యూఢిల్లీ : వర్క్ప్లేస్లో వేధింపులను తట్టుకోలేకపోతున్నామని వేలాది మంది ఆల్ఫాబెట్ కంపెనీ ఉద్యోగులు సీఈఓ సుందర్ పిచ్చాయ్కి బహిరంగ లేఖ రాశారు. పని చేయడానికి అనువైన సురక్షిత వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మాజీ ఉద్యోగిని ఒకరు అనుభవించిన వేధింపుల గురించి ఓ పత్రిక ప్రచురించిన విషయాన్ని ఈ లేఖలో ప్రస్తావించారు.
దాదాపు 1,300 మంది ఉద్యోగులు ఈ బహిరంగ లేఖను ‘మీడియం’ అనే ఆన్లైన్ బ్లాగులో పోస్ట్ చేశారు. ఈ ఉద్యోగుల పేర్లను కూడా దీనిలో పేర్కొన్నారు. వేధింపులకు పాల్పడేవారికి టీమ్ లీడ్స్ హోదాను తొలగించాలని, నిందితులను కాపాడవద్దని డిమాండ్ చేశారు. తమను వేధింపులకు గురిచేసినవారితో కలిసి పని చేయవలసిన అవసరం లేకుండా టీమ్స్ను మార్చాలని కోరారు.
వేధింపులకు గురైనవారిని కాపాడటానికి బదులుగా వేధించినవారిని ఆల్ఫాబెట్ కాపాడుతుండటం కొత్త కాదని, ఇది చాలా కాలం నుంచి కొనసాగుతోందని ఆరోపించారు. తనను వేధించినవారిపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని ఆల్ఫాబెట్ను వదిలిపోయేలా చేస్తున్నారని, వేధించినవారు ఆల్ఫాబెట్లోనే ఉంటున్నారని, వారికి రివార్డులు ఇస్తున్నారని దుయ్యబట్టారు.
గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్పాబెట్లో గతంలో జరిగిన సంఘటనలను ఈ పిటిషన్లో ప్రస్తావించారు. ఆండ్రాయిడ్ మొబైల్ సాఫ్ట్వేర్ సృష్టికర్త ఆండీ రూబిన్పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఓరల్ సెక్స్ చేయాలని తనను ఆండీ రూబిన్ బలవంతం చేశారని ఆ మహిళ ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. అయితే ఆల్ఫాబెట్ కంపెనీ ఆండీ రూబిన్కు 90 మిలియన్ డాలర్లు ఎగ్జిట్ ప్యాకేజీ ఇచ్చిందని పేర్కొన్నారు. అదేవిధంగా మాజీ సెర్చ్ ఎగ్జిక్యూటివ్ అమిత్ సింఘాల్పై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలపై విచారణ అనంతరం ఆయన చేత రాజీనామా చేయించారని, ఆయనకు 35 మిలియన్ డాలర్లు రివార్డ్ ఇచ్చిందని పేర్కొన్నారు.
వేధింపులకు పాల్పడేవారు లేనటువంటి వాతావరణంలో పని చేసే హక్కు ఆల్ఫాబెట్ వర్కర్లకు ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. వేధింపులకు గురైనవారి ఆందోళనకు ప్రాధాన్యమిస్తూ, వర్కర్ల భద్రతకు పెద్దపీట వేయాలని ఆల్ఫాబెట్ను ఈ పిటిషన్లో కోరారు.