24 ఏళ్లకే నూరేళ్ల జీవితం..!
ABN , First Publish Date - 2021-05-19T07:58:30+05:30 IST
గ్రెగరీ రేమండ్ రాఫెల్, సోజాలది అందమైన కుటుంబం! ముత్యాల్లాంటి ముగ్గురు మగ పిల్లలు. చివరి ఇద్దరు కవలలు. ఎంతో ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో కొవిడ్ మహమ్మారి విషాదాన్ని గుమ్మరించింది
కొవిడ్కు టెకీ కవలలు బలి
గత నెలలోనే పుట్టిన రోజు వేడుక
కొవిడ్తో గంటల వ్యవధిలో మృతి
మేరఠ్లో ఓ కుటుంబం విషాదగాథ
మేరఠ్, మే 18 : గ్రెగరీ రేమండ్ రాఫెల్, సోజాలది అందమైన కుటుంబం! ముత్యాల్లాంటి ముగ్గురు మగ పిల్లలు. చివరి ఇద్దరు కవలలు. ఎంతో ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో కొవిడ్ మహమ్మారి విషాదాన్ని గుమ్మరించింది. కవల సోదరులను బలి తీసుకుంది. ఉత్తరప్రదేశ్లోని మేరఠ్కు చెందిన రేమండ్, సోజా.. ఇరువురూ టీచర్లే. నెల్ఫ్రెడ్ పెద్దకొడుకు కాగా.. తర్వాత పుట్టిన జోఫ్రెడ్ వర్ఘీస్ గ్రెగరీ, రాల్ఫ్రెడ్ జార్జి గ్రెగరీ కవలలు. కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆ ఇద్దరూ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. గత నెలలోనే 24వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ మరునాడే.. ఏప్రిల్ 24న ఇద్దరికీ ఒకేసారి జ్వరం వచ్చింది. కొవిడ్తో పోరాడుతూ గత వారం గంటల వ్యవధిలో మరణించారు. ఊపిరి తీసుకోవడంతో ఇబ్బందిపడుతూ జోఫ్రెడ్ మరణించాడన్న సమాచారం తమకు అందగానే.. రాల్ఫ్రెడ్ కూడా తిరిగి రాకపోవచ్చంటూ తన భార్యను అనునయించానని కవలల తండ్రి రేమండ్ చెప్పారు.
ఆ ఇద్దరూ ఈ నెల 13, 14 తేదీల్లో గంటల వ్యవధిలో మరణించారని గద్గదస్వరంతో చెప్పారు. కొరియా వెళ్లాలని వారు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని.. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుందన్నారు. ‘చరమాంకంలో మాకు మంచి జీవితం ఇవ్వాలని వారిద్దరూ ఎన్నో కలలు కన్నారు. టీచర్లుగా మేమెంత కష్టపడ్డామో వారికి తెలుసు. దేవుడు మాకు ఎందుకిలా చేశాడో అర్థం కావడం లేదు’ అని రేమండ్ వాపోయారు. మేరఠ్ కంటోన్మెంట్ ప్రాంతం లో ఆ కుటుంబం నివసిస్తోంది. జ్వరం వచ్చిన తర్వాత కవల సోదరులు కొద్దికాలం ఇంట్లోనే చికిత్స పొందారు. ఆక్సిజన్ స్థాయులు పడిపోతుండటంతో మే 1న ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజులకే పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. కానీ ఊహించని విధంగా పరిస్థితి తలకిందులైంది.