విష్ణు నివాసం కొవిడ్ కేంద్రంలో ఆకలి కేకలు
ABN , First Publish Date - 2022-01-21T07:07:28+05:30 IST
కొవిడ్ బారిన పడిన వారికి మంచి ఆహారం, తగిన వైద్యంతోపాటు ప్రశాంతమైన వాతావరణం ఉంటే త్వరగా కోలుకోవచ్చు.
తిరుపతి సిటీ, జనవరి 20: కొవిడ్ బారిన పడిన వారికి మంచి ఆహారం, తగిన వైద్యంతోపాటు ప్రశాంతమైన వాతావరణం ఉంటే త్వరగా కోలుకోవచ్చు. ఇందులో భాగంగానే ప్రభుత్వం ప్రత్యేకంగా కొవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ తిరుపతిలోని విష్ణునివాసం కొవిడ్ కేర్ సెంటర్లో మాత్రం పురుగులతో నిండిన ఆహారం పెడుతున్నారని, తాగునీరు కూడా దుర్గంధం వెదజల్లుతోందని బాధితులు గురువారం ఆ కేంద్రం ముందు బైఠాయించి, నిరసన తెలిపారు. పలువురు బాధితులు మాట్లాడుతూ.. ఇక్కడ 587 మంది వరకు చికిత్స పొందుతున్నామని చెప్పారు. అయితే అధికార పార్టీ నేతలకు సంబంధించిన బంధువులు, అధికారులకు, సిఫార్సులపై వచ్చేవారికి విష్ణునివాసంలోని 5, 6 అంతస్తుల్లోని గదులను కేటాయించి, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారని ఆరోపించారు. మిగిలిన అంతస్తుల్లోని తమకేమో పురుగులతో నిండిన ఆహారం పెడుతున్నారని వాపోయారు. భోజనం కూడా సమయం దాటాక అందుతోందని అప్పటివరకు మంచినీళ్లు తాగుదామంటే అవి కూడా దుర్గంధం వెదజల్లుతున్నాయన్నారు. వారి మాటల్లోనే.. ‘ఈ కేంద్రంలో భోజనాలు తిన్న నలుగురు బాధితులు ఇప్పటికే అతిసార బారిన పడ్డారు. వృద్ధులు, చిన్నారులు భోజనాలు తినలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు కనీసం వారంలో ఒక రోజు కూడా గదులను, మరుగుదొడ్లను శుభ్రం చేసే నాథుడే లేరు. దుర్గంధం నడుమ ముక్కు మూసుకుని కాలం గడపాల్సి వస్తోంది. వైద్య పరీక్షలు చేసిన వారు కూడా సరిగా రావడం లేదు. ఈ విషయాలను ఇక్కడకు వచ్చిన పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. కనీసం ఇక్కడి నుంచి పంపేయాలని ప్రాధేయపడినా ప్రయోజనం కనిపించలేదు. ఇలాగే కొనసాగితే ఆకలితోపాటు అనారోగ్యంతో చనిపోయే దుస్థితి దాపురిస్తుంది. అందువల్లే నిరసనకు దిగాం’ అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన విషయం తెలుసుకున్న అధికారులు బాధితుల వద్దకొచ్చారు. దీంతో ఒక్కసారిగా అధికారులతో బాధితులు వాగ్వాదానికి దిగారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, వైద్యం అందించలేకుంటే ఇళ్లకు పంపేయాలని మొరపెట్టుకున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు చేపడతామని అధికారులు వారికి హామీ ఇవ్వడంతో ఆందోళన సర్దుమణిగింది.