రెస్టారెంట్లో దొంగ తిండి... కేసు పెట్టని యజమాని!
ABN , First Publish Date - 2020-05-31T11:46:08+05:30 IST
మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. లాక్డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో ఒక వ్యక్తి రెస్టారెంట్లోకి చొరబడి ఆహారం తిన్నాడు. విషయం తెలుసుకున్న ఆ రెస్టారెంట్...
యవత్మల్: మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. లాక్డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో ఒక వ్యక్తి రెస్టారెంట్లోకి చొరబడి ఆహారం తిన్నాడు. విషయం తెలుసుకున్న ఆ రెస్టారెంట్ యజమాని సదరు దొంగపై కేసు పెట్టేందుకు నిరాకరించారు. ఆకలిలో ఉండి ఇలా చేసివుంటాడని యజమాని అన్నారు. వివరాల్లోకి వెళితే యవత్మల్లోని గాంధీ చౌక్లో ఒక రెస్టారెంట్ ఉంది. ఒక వ్యక్తి రెస్టారెంట్లోని కిచెన్లోకి చొరబడి దొరికనంత ఆహారం తిన్నాడు. తరువాత క్యాష్బాక్స్లోని రెండు వందల రూపాయలు తీసుకుని పారిపోయాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. వీడియో ఫుటేజ్లో ఉన్న దాని ప్రకారం ఆ వ్యక్తి రెస్టారెంట్ తలుపు పగలగొట్టి నేరుగా వంటగదికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఆహారాన్నిఆత్రంగా తిన్నాడు. తరువాత నగదు కౌంటర్ నుంచి రూ.200 తీసుకుని పారిపోయాడు. ఈ ఘటనకు పాల్పడిన ఆ వ్యక్తిపై పోలీసు కేసు పెట్టడం తనకు ఇష్టం లేదని రెస్టారెంట్ యజమాని రాజేష్ మోర్ తెలిపారు. డబ్బులు లేక మరోవైపు ఆకలి తీర్చుకునేందుకు ఆ వ్యక్తి దొంగతనానికి పాల్పడి ఉంటాడని రాజేష్ అన్నారు.