Sad: తప్పిపోయిన ఆవు కోసం వెతుక్కుంటూ వెళ్లిన భార్యాభర్తలు.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో బంధువులు వెళ్లి చూస్తే..
ABN , First Publish Date - 2021-10-08T23:29:20+05:30 IST
పెంపుడు జంతువుల మీద ఉన్న ప్రేమ.. చివరికి వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. తమ పెంపుడు ఆవు కనబడలేదని.. వెతకడం కోసం వెళ్లిన ఆ భార్యాభర్తలు ఎంతకీ తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన వారి బంధువులు వెతకడం కోసం వెళ్లారు.
పెంపుడు జంతువుల మీద ఉన్న ప్రేమ.. చివరికి వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. తమ పెంపుడు ఆవు కనబడలేదని.. వెతకడం కోసం వెళ్లిన ఆ భార్యాభర్తలు ఎంతకీ తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన వారి బంధువులు వెతకడం కోసం వెళ్లారు. తీరా అక్కడ కనిపించిన దృశ్యం చూసి.. షాక్కు గురయ్యారు. స్థానికంగా విషాదాన్ని నింపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో వెల్లూరు జిల్లా తిరువళం సమీపంలోని ఉల్లి పుత్తూరులో జయప్రకాష్, అశ్విని దంపతులు నివాసం ఉంటున్నారు. వ్యవసాయంతో పాటూ పశువులను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రోజు ఆవు కనిపించకుండా పోయింది. కంగారుపడిన దంపతులు.. ఆవు కోసం రాత్రి సమయంలో వెతుక్కుంటూ వెళ్లారు. వారు కూడా ఎంతకీ ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వారికి, బంధువులకు అనుమానం కలిగింది. దీంతో ఆ దంపతుల కోసం మిగతా వారంతా వెతకడానికి వెళ్లారు.
ఓ పొలంలో విగతజీవులుగా పడి ఉన్న భార్యభర్తలను చూసి అంతా షాక్ అయ్యారు. పక్కనే ఆవు కూడా చనిపోయి పడి ఉంది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విజయ్కుమార్ అనే వ్యక్తికి చెందిన పొలంగా తేలింది. ఆ గ్రామం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. దీంతో వన్యప్రాణులు పంటను నాశనం చేయకుండా పొలం యజమాని.. పంట చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేశాడు.
ఈ విషయం తెలీని.. ఆ దంపతులు పొరపాటున తాకడంతో కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. అయితే కేసు అవుతుందనే భయంతో.. స్థలం యజమాని ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ను తీసేయించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో విజయ్కుమార్తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు.