భార్య ఎవరితోనో ఫోన్ మాట్లాడుతోందని అనుమానంతో..
ABN , First Publish Date - 2020-05-27T14:31:34+05:30 IST
సడలింపులతో మద్యం దుకాణాలు తెరుచుకున్నాక.. మత్తులో ప్రమాదాలు, దారుణాలు..
హైదరాబాద్/నిజాంపేట్ : సడలింపులతో మద్యం దుకాణాలు తెరుచుకున్నాక.. మత్తులో ప్రమాదాలు, దారుణాలు.. మళ్లీ ప్రారంభమయ్యాయి. తాజాగా మంగళవారం నగరంలో మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు హత్యకు గురయ్యారు. మరొకరు కాళ్లు, చేయి విరిగి దారుణంగా గాయపడ్డారు.
అనుమానం పెనుభూతమై..
అనుమానం పెనుభూతమై భార్యను హత్య చేశాడు ఓ భర్త. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన శ్రీరాంమూర్తి కుమారై జయలక్ష్మి (32) వివాహం గుడివాడకు చెందిన వెంకటరత్నం కుమారుడు వెన్నకోట సతీష్ (39)తో 16 ఏళ్ల క్రితం జరిగింది. వారికి ఇద్దరు కుమారులున్నారు. ఈ దంపతులు బాచుపల్లిలోని రాజీవ్గాంధీ నగర్లో నివాసం ఉంటున్నారు. సతీష్ చందానగర్లోని ఓ జువెలరీ షాపులో పనిచేస్తుండగా, అతడి భార్య జయలక్ష్మి హిల్కౌంటీలో హౌస్కీపింగ్ సూపర్వైజర్గా పని చేస్తోంది. నాలుగైదు రోజులుగా తన భార్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుందని సతీష్ అనుమానించి ప్రశ్నించడంతో ఈ నెల 20న ఇరువురి మధ్య గొడవ జరిగింది.
ఈ విషయాన్ని జయలక్ష్మి వారి తల్లిదండ్రులకు చెప్పగా లాక్డౌన్ కారణంగా వారు రాలేకపోయారు. దీంతో అదే కాలనీలో నివసిస్తున్న తోబుట్టువు ఇంట్లో ఉండమని చెప్పారు. సోమవారం కూడా మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అదే రోజు రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న జయలక్ష్మి తల, ముఖంపై బండరాయితో మోది సతీష్ ఆమెను హత్య చేశాడు. జయలక్ష్మి తమ్ముడు నూకరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.