భార్య ఉరేసుకున్న దూలానికే భర్త కూడా

ABN , First Publish Date - 2021-06-22T08:52:15+05:30 IST

కుల వృత్తి కూడు పెట్టలేదు.. అప్పులు తీర్చేమార్గం కనిపించలేదు.. చేతిలో చిల్లిగవ్వ లేని, పిల్లలకు ముద్ద పెట్టలేని ఈ కటిక దారిద్ర్యాన్ని అనుభవించలేక ఆ దంపతులు 50 రోజుల వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్నారు.

భార్య ఉరేసుకున్న దూలానికే భర్త కూడా

ఉపాధి లేక 50 రోజుల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య 

దుబ్బాక, జూన్‌ 21: కుల వృత్తి కూడు పెట్టలేదు.. అప్పులు తీర్చేమార్గం కనిపించలేదు.. చేతిలో చిల్లిగవ్వ లేని, పిల్లలకు ముద్ద పెట్టలేని ఈ కటిక దారిద్ర్యాన్ని అనుభవించలేక ఆ దంపతులు 50 రోజుల వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఇద్దరు కుమార్తెలు ఇప్పుడు అనాథలుగా మారారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పరిధిలోని చెల్లాపూర్‌కు చెందిన సంగోజు నర్సింహచారి(50) వడ్రంగి. ఇటీవల కాలంలో పని దొరకక కుటుంబాన్ని పోషించడానికి అప్పులు చేశాడు. ఇటీవల అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో నర్సింహచారి భార్య దేవేంద్ర (45) మే 1న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నర్సింహచారి.. స్థల మార్పిడితోనైనా కలిసి వస్తుందని కూతుళ్లు గాయ త్రి(23), లక్ష్మీప్రియ(13)ను తీసుకుని సిద్దిపేటకు మకాం మార్చాడు. నెలరోజులుగా సిద్దిపేటలోనూ పని లభించక పొట్టగడవడమే కష్టంగా మారింది. కుంగిపోయిన నర్సింహచారి.. రెండు రోజుల క్రితం చెల్లాపూర్‌ వచ్చాడు. భార్య ఉరేసుకున్న దూలానికే సోమవారం ఉరేసుకున్నాడు. 

Updated Date - 2021-06-22T08:52:15+05:30 IST