మార్కెట్లో నకిలీ శానిటైజర్లు.. ముగ్గురి అరెస్ట్
ABN , First Publish Date - 2020-03-29T13:25:37+05:30 IST
మార్కెట్లో నకిలీ శానిటైజర్లు.. ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్, చార్మినార్(ఆంధ్రజ్యోతి): అనుమతులు లేకుండా ఇంట్లోనే శానిటైజర్లు తయారుచేసి, వాటిని బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్న ముగ్గురిని సౌత్జోన్ టాస్క్ఫోర్స్ సిబ్బంది, మీర్చౌక్, భవానీనగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 20 వేల విలువైన 188 శానిటైజర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మొఘల్పురా ప్రాంతానికి చెందిన వాజిద్ (56) హోమియో మందులు తయారు చేసేవాడు. ప్రస్తుతం శానిటైజర్లకు డిమాండ్ పెరగడంతో వాటి తయారీకి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి, ఇంట్లోనే శానిటైజర్లు తయారు చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మెడికల్ రిప్రజెంటివ్ మహ్మద్ షకీరుద్దీన్(29), వ్యాపారి సయ్యద్ అజహర్హుస్సేన్ (30), మహ్మద్ అబ్దుల్ వసీ(21) ఈ అమ్మడంలో ఇతనికి సహకరించారు. వాజిద్ తయారు చేసిన శానిటైజర్లకు బ్రాండ్ల స్కిక్కర్లు అంటించి అమ్మేవారు. భవానీనగర్, మీర్చౌక్ ప్రాంతాల్లోని మెడికల్ షాపుల్లో చేపట్టిన తనిఖీల్లో ఈ శానిటైజర్లను గుర్తించారు. అనుమతులు లేకుండా శానిటైజర్లు తయారు చేసి, విక్రయిస్తున్న వాజిద్, షకీయుద్దీన్, అజహర్ హుస్సేన్లను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు వసీ పరారీలో ఉన్నాడు. నిందితులను స్వాధీనం చేసుకున్న సామగ్రిని భవానీనగర్, మీర్చౌక్ పోలీసులకు అప్పగించారు.