HYD : ఇంటింటికీ వెళ్లకుండానే Voter పరిశీలన.. త్వరలో తొలగింపులు..!

ABN , First Publish Date - 2021-12-05T14:42:38+05:30 IST

క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఓటర్‌ ముసాయిదా...

HYD : ఇంటింటికీ వెళ్లకుండానే Voter పరిశీలన.. త్వరలో తొలగింపులు..!

హైదరాబాద్‌ సిటీ : క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఓటర్‌ ముసాయిదా జాబితాపై ఇంటింటి పరిశీలన పూర్తి చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్‌ జిల్లాలో ఇప్పటికే 52 శాతానికిపైగా పరిశీలన పూర్తయ్యింది. పరిశీలన తరువాతే పేర్ల తొలగింపును ప్రతిపాదిస్తున్నట్టు సంస్థలోని ఎన్నికల విభాగం వర్గాలు చెబుతున్నాయి. కానీ, వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మెజార్టీ ప్రాంతాల్లో ఇంటింటి పరిశీలన జరగడం లేదు. జిల్లాలోని 15నియోజకవర్గాల్లో 4.35 లక్షలకుపైగా ఓటర్లు ఉండగా ఇప్పటివరకు 22.99 లక్షల ఓటర్లను పరిశీలించారు. ఇందులో 2,300లకుపైగా చనిపోయిన, 1,800లకుపైగా ఒకటి కంటే ఎక్కువసార్లు పేర్లున్న, 2,700లకు పైగా చిరునామా మారిన వారున్నట్టు గుర్తించారు. తుది జాబితాలో వీరి పేర్లను తొలగించనున్నారు.


ఇంటింటికీ వెళ్లి సంబంధిత వ్యక్తి లేదా కుటుంబ సభ్యుల సంతకం తీసుకున్న అనంతరం జాబితా నుంచి పేర్లు తొలగించాలని ప్రభుత్వం సూచించింది. సిబ్బంది మాత్రం ఎప్పటిలానే ఓ చోట కూర్చుని ప్రక్రియను మమ అనిపిస్తున్నారు. అత్యధికంగా సనత్‌నగర్‌ నియోజకవర్గం జాబితాలో పేర్లున్న 1,510మంది చనిపోయినట్టు గుర్తించారు. 800 పేర్లు ఒకటి కంటే ఎక్కువసార్లు ఉన్నట్టు, 713 మంది చిరునామా మారినట్టు గుర్తించారు. అన్ని నియోజకవర్గాల్లో గుర్తించిన దాంట్లో దాదాపు 60 నుంచి 70శాతం ఈ నియోజకవర్గంలోనే ఉండడం గమనార్హం. ముషీరాబాద్‌, మలక్‌పేట, గోషామహల్‌ నియోజకవర్గాల్లో తొలగింపునకు ఒక్కరి పేరూ ప్రతిపాదించ లేదు. గోషామహల్‌లో అత్యల్పంగా 6.43 శాతం మాత్రమే పరిశీలన జరిగింది.

Updated Date - 2021-12-05T14:42:38+05:30 IST