దేవుణ్ణి పూజించడం... నిమజ్జనం చేయడం ప్రజల హక్కు: భగవంత్ రావు

ABN , First Publish Date - 2021-09-11T19:25:33+05:30 IST

దేవుణ్ణి పూజించడం... నిమజ్జనం చేయడం ప్రజల హక్కని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత్ రావు అన్నారు.

దేవుణ్ణి పూజించడం... నిమజ్జనం చేయడం ప్రజల హక్కు: భగవంత్ రావు

హైదరాబాద్: దేవుణ్ణి పూజించడం... నిమజ్జనం చేయడం ప్రజల హక్కని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత్ రావు అన్నారు. నిమజ్జనంపై ఆంక్షలు విధించిన హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని... అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లి ప్రభుత్వము నిమజ్జనం సాఫీగా సాగేందుకు కృషి చేయాలని కోరారు. నిమజ్జనం ముందు... నిమజ్జనం తర్వాత నీటిని పరిశీలన చేయమన్నారని అన్నారు. గణేష్ విగ్రహాలతో నీరు కలుషితం అవుతుంది అనేది ఎక్కడ రిపోర్టు లేదని ఆయన తెలిపారు. నాలాల కలుషిత నీటితోనే హుస్సేన్ సాగర్‌లో నీరు కలుషితం అవుతుందని చెప్పారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ నీరు 100 శాతం కలుషితం అయిందని అన్నారు. 


365 రోజులు పరిశ్రమలు, నాలాల నీరు హుస్సేన్ సాగర్‌లోకి వస్తుంది అది కలుషితం కావడం లేదా అని ప్రశ్నించారు. గణేష్ నిమజ్జనం ద్వారా హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుంది అని ఎవరు తేల్చారని అడిగారు.  ఎక్కడ కూడా నిమజ్జనం చేయొద్దు అంటే ఎలా అని ప్రశ్నిస్తూ అన్ని వాటర్ బాడీస్ లోపల నిమజ్జనం చేసేందుకు కృషి చేయాలని కోరారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం ద్వారా కాలుష్యం కాదని, రసాయన వ్విగ్రహాల ద్వారా నీరు కలుషితం అవుతుంది అని ఎక్కడ రిపోర్ట్ లేదని స్పష్టం చేశారు. ప్రతిష్టించిన విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలని... విగ్రహాలు రోడ్లపై అలానే ఉండాలా అని ప్రశ్నించారు. 


ప్రభుత్వ అధికారులే కోర్టుకు తప్పుడు రిపోర్టులు ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వం పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం కోర్టుకు సరైన వివరాలు అందించడంలో విఫలం అయిందని ఆయన అన్నారు.  రాజ్యాంగానికి వ్యతిరేఖంగా కోర్టులు తీర్పులు చెబుతున్నాయని చెప్పారు. కోర్టు తన పరిధిలో లేని విషయాలు ప్రజలపై రుద్దుతున్నారని... కోర్టులు సంప్రదాయాలకు,  ప్రజలకు ఇబ్బందు లు లేకుండా తీర్పు ఇవ్వాలని అన్నారు.  ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఎకో ఫ్రెండ్లీ కలర్లు ఎక్కడ దొరుకుతుందో ప్రభుత్వం చెప్పాలని భగవంత్ రావు అన్నారు. 

Updated Date - 2021-09-11T19:25:33+05:30 IST